can't even buy a kilo of cotton! కిలో పత్తి అయినా కొనలే!
ABN , Publish Date - Nov 11 , 2025 | 11:24 PM
can't even buy a kilo of cotton! జిల్లాలో మొంథా తుఫాన్ పత్తి రైతులను కూడా దెబ్బతీసింది. సరిగ్గా పంట చేతికందుతున్న సమయంలో భారీ వర్షాలు కురవడంతో పంటకు నష్టం జరిగింది. పత్తి రంగు మారింది. ఈ పరిస్థితిలో పంటను కొనుగోలు చేస్తారా? లేదా? అన్న అనుమానం రైతులను వెంటాడుతోంది. దీనికితోడు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీఐఐ) కొనుగోలు కేంద్రాలను తెరవలేదు. మద్దతు ధరపై స్పష్టత ఇచ్చింది కానీ కొనుగోలుకు అనుకూల పరిస్థితులు కల్పించలేదు. దీంతో దళారులు రంగప్రవేశం చేశారు. రకరకాల కారణాలు చెబుతూ...కుంటిసాకులతో రైతులను భయపెట్టి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు.
కిలో పత్తి అయినా కొనలే!
సేకరణకు అందివచ్చిన పంట
మొంథా తుఫాన్తో రంగుమారిన వైనం
రాజాంలో ప్రారంభం కాని కొనుగోలు కేంద్రం
ఆందోళనలో రైతులు
జిల్లాలో మొంథా తుఫాన్ పత్తి రైతులను కూడా దెబ్బతీసింది. సరిగ్గా పంట చేతికందుతున్న సమయంలో భారీ వర్షాలు కురవడంతో పంటకు నష్టం జరిగింది. పత్తి రంగు మారింది. ఈ పరిస్థితిలో పంటను కొనుగోలు చేస్తారా? లేదా? అన్న అనుమానం రైతులను వెంటాడుతోంది. దీనికితోడు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీఐఐ) కొనుగోలు కేంద్రాలను తెరవలేదు. మద్దతు ధరపై స్పష్టత ఇచ్చింది కానీ కొనుగోలుకు అనుకూల పరిస్థితులు కల్పించలేదు. దీంతో దళారులు రంగప్రవేశం చేశారు. రకరకాల కారణాలు చెబుతూ...కుంటిసాకులతో రైతులను భయపెట్టి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు.
రాజాం, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో పత్తి పంట విస్తారంగా సాగవుతుండేది. కొన్నాళ్లుగా సరైన ప్రోత్సాహం లేక సాగు విస్తీర్ణం ఏడాదికేడాది తగ్గుతోంది. ప్రస్తుతం 9 వేల హెక్టార్లలో పండిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే మొన్నటి తుఫాన్కు పత్తికి పంటకు నష్టం జరిగింది. కేవలం 10 హెక్టార్లలో మాత్రమే నష్టం వచ్చినట్లు అధికారులు అంచనాలు రూపొందించారు కానీ రంగుమారిన పత్తి విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదని రైతులు చెబుతున్నారు. పత్తి సాగులో పెట్టుబడులు పెరిగాయి. ఎకరా పత్తి సాగుకు రూ.25 వేలకుపైగా ఖర్చవుతుంది. సాధారణంగా ఎకరా భూమి విస్తీర్ణంలో పత్తి సాగుచేస్తే 9 నుంచి 10 క్వింటాళ్లు చేతికి అందుతుంది. ఈ ఏడాది 3 క్వింటాళ్లకు మించి రాదని రైతులు సందేహిృస్తున్నారు. ఆపై తుఫాను ప్రభావంతో పత్తి రంగు మారింది. దీంతో అనుకున్న స్థాయిలో మద్దతు ధర కూడా లభించదని భయపడుతున్నారు. పెట్టిన పెట్టుబడులు, శ్రమ కూడా రాని పరిస్థితి ఉందని వాపోతున్నారు.
దళారుల రంగప్రవేశం
పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో దళారులు రంగప్రవేశం చేశారు. గ్రామాల్లోకి వచ్చి పత్తి రంగుమారిందని.. అంత ధర పలకదని చెబుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం క్వింటా పత్తి మద్దతు ధరను రూ.8,110గా ప్రకటించింది. అయితే పత్తి నాణ్యంగా ఉండాలన్న షరతు పెట్టింది. దీనినే సాకుగా చూపి వ్యాపారులు క్వింటా పత్తిని రూ.5,200కు కొనుగోలు చేస్తున్నారు. ఆపై తూకంలో క్వింటా వద్ద 5 కిలోలు అదనంగా తూకం వేస్తున్నారు. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. గతంలో ఉమ్మడి జిల్లాలో మూడు చోట్ల పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసేవారు. రామభద్రాపురం, సాలూరుతో పాటు రాజాంలో ఏర్పాటుచేసేవారు. ఈసారి రాజాంలోనే కేంద్రం తెరిచేందుకు నిర్ణయించారు. నేటికీ ప్రారంభించలేదు.
కొనుగోలు చేస్తాం..
జిల్లాలో రాజాంలో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేయనున్నాం. రామభద్రపురంలో ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదన ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చిన వెంటనే ప్రారంభిస్తాం. రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద విక్రయించి మద్దతు ధర పొందాలి. దళారుల బారిన పడొద్దు.
- రవికిరణ్, ఏడీ, మార్కెటింగ్ శాఖ, విజయనగరం
తక్షణం ప్రారంభించాలి..
తక్షణం రాజాంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలి. మద్దతు ధరతో కొనుగోలు చేయాలి. ఈ ఏడాది పంటను తుఫాన్ దెబ్బతీసింది. ఎకరా భూమిలో 3 క్వింటాళ్లు కూడా దిగుబడి వస్తుందో? రాదో? చెప్పలేం. రంగు మారిన పత్తిని సైతం కొనుగోలు చేయాలి.
- సామంతుల తవిటినాయుడు, రైతు, రాజీయ్యపేట, రాజాం మండలం