సందడిగా బడి పండుగ
ABN , Publish Date - Jul 11 , 2025 | 12:28 AM
జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో గురువారం మెగా పేరెంట్- టీచర్స్ సమావేశాలు (పీటీఎం 2.0) సందడిగా జరిగాయి.
- జిల్లా వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలు
- హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు
పార్వతీపురం/మక్కువ/సాలూరు/పార్వతీపురంటౌన్, జూలై 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో గురువారం మెగా పేరెంట్- టీచర్స్ సమావేశాలు (పీటీఎం 2.0) సందడిగా జరిగాయి. పాఠశాలలు, కళాశాలలకు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులపై పూలుజల్లుతూ ఉపాధ్యాయులు, అధ్యాపకులు వారికి స్వాగతం పలికారు. ఓపెన్హౌస్ ఫొటోబూత్ వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు ఫొటోలు దిగారు. అనంతరం తమ పిల్లలతో కలసి వారి తరగతి గదుల్లో తల్లిదండ్రులు కూర్చొన్నారు. ప్రతివిద్యార్థి తల్లిదండ్రులతో సంబంధిత క్లాస్ టీచర్ ప్రత్యేకంగా సమావేశమై పిల్లల సమగ్ర పురోగతి కార్డులు(పోగ్రస్), హెల్త్కార్డులు అందించారు. విద్యార్థులు వారి తల్లులకు పుష్పాలు సమర్పించి పాదాలకు నమస్కరించారు. విద్యార్థులకు మొక్కలను అందించారు. పలుచోట్ల ముగ్గులు, ఆటల పోటీలు నిర్వహించారు. సమావేశం ముగిసిన తరువాత అంతా కలసి మఽధ్యాహ్న భోజనం చేశారు. గరుగుబిల్లి మండలం రావిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన పీటీఎం సమావేశంలో ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, సీతంపేట పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పాల్గొన్నారు.
విద్యారంగం అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి సంధ్యారాణి
విద్యారంగం అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. మక్కువ జూనియర్ కళాశాలలో నిర్వహించిన మెగా పేరెంట్- టీచర్స్ సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థుల ప్రమాణాలను మెరుగుపర్చడమే కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధ్యాపకుల మధ్య సామరస్యాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్యఉద్దేశమని అన్నారు. ‘విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తూ పాఠశాలలు, జూనియర్ కళాశాలలను ఆధునీకరిస్తున్నాం. విద్యార్థుల ప్రతిభను మరింత పెంపొందించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి. వారు ఉన్నత స్థానాలకు ఎదిగేలా ఉపాధ్యాయలు కృషి చేయాలి. పిల్లలను సెల్ఫోన్లకు దూరంగా ఉంచాలి. వారి నడవడికలను నిశితంగా పరిశీలించాలి. బాల్య వివాహాలు చేయరాదు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ తల్లికివందనం పథకాన్ని వర్తింపజేశాం. విద్యార్థులకు పాఠ్య, నోటు పుస్తకాలు, బ్యాగ్లు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం.’ అని మంత్రి తెలిపారు.
పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి..
‘నేను చదివిన కాలేజీలోనే మంత్రి హోదాలో ప్రసంగించడం నా అదృష్టం. మేము నాటిన మొక్కలు నేడు చెట్లు అయ్యాయి. ఇక్కడే ఆటలు ఆడాం. సైన్స్ ల్యాబ్ల్లో ఉల్లాసంగా గంతులేశాం.’ అని మంత్రి సంధ్యారాణి అన్నారు. విద్యార్థినుల మధ్యలో ఆమె కూర్చుని గత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. వారితో సెల్ఫీలు తీసుకున్నారు. కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటి ఉపాధ్యాయులతో ఫొటోలు దిగారు. తన పాత ఉపాధ్యాయ వృత్తిని తలచుకున్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ కె.రామచంద్రరావు, జిల్లా విద్యాశాఖాధికారి రాజ్కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ మంజులవీణ, తహసీల్దార్ భరత్, డిప్యూటీ ఎంపీడీవో ఎన్.సూర్యనారాయణ, టీడీపీ మండల అధ్యక్షుడు గుల్ల వేణుగోపాలనాయుడు, అరకు పార్లమెంటరీ వైద్య విభాగం అధ్యక్షుడు పి.మల్లేశ్వరరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
మన విద్యార్థులు మాణిక్యాలు:కలెక్టర్
కొత్తవలస పోలమ్మ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో టగ్ ఆఫ్ వార్ ఆటలో కలెక్టర్
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులంతా ప్రతిభలో మాణిక్యాలేనని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ప్రశంసించారు. జిల్లా కేంద్రంలోని కొత్తవలస పోలమ్మ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్స్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారని అన్నారు. గత మూడేళ్లుగా రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలుస్తుందని అన్నారు. ఈ విద్యాసంవత్సరంలో కూడా ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు శ్రమించాలని అన్నారు. అనంతరం జరిగిన ఆటల పోటీల్లో కలెక్టర్ ఉత్సాహంగా పాల్గొన్నారు.