మామిడితోటలో బెట్టింగ్
ABN , Publish Date - May 03 , 2025 | 12:07 AM
బొబ్బిలి పోలీసు స్టేషన్ పరిధి శివరామపురం గ్రామ శివార్లలోని మామిడితోటలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ను నిర్వహిస్తున్న 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
11 మంది అరెస్టు
రూ.14లక్షలు స్వాధీనం
బెట్టింగ్ యాప్ల జోలికిపోవద్దు: ఎస్పీ
విజయనగరం క్రైం, మే 2 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి పోలీసు స్టేషన్ పరిధి శివరామపురం గ్రామ శివార్లలోని మామిడితోటలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ను నిర్వహిస్తున్న 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్ విలేకరులకు వెల్లడించారు. శివరామపురం శివార్లలో బెట్టింగ్కు పాల్పడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా, ఐపీఎల్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టయింది. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ముషిడిపల్లి దివాకర్ నగదు సంపాదించాలనే లక్ష్యంతో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్నాడు. దీనికోసం బెంగళూరుకు చెందిన నిరంజన్రెడ్డి అనే వ్యక్తి నుంచి రాథే ఎక్సైంజ్ అనే బెట్టింగ్ యాప్ అడ్మిన్ తీసుకున్నాడు. విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్నం జిల్లాల్లో ఏజెంట్లను నియమించుకున్నారు. యువతను ఆకర్శించేందుకు కమీషన్లు ఇచ్చేవారు. ఏజెంట్లు బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తూ, యువతను ఆకర్శిస్తూ, వాట్సాప్ల ద్వారా లింక్లు షేర్ చేస్తూ పథకం ప్రకారం బెట్టింగులకు పాల్పడుతున్నారు. దీన్ని మరింత విస్తృతం చేయాలన్న ఉద్దేశంతో దివాకర్ పార్వతీపురం ప్రాంతానికి చెందిన గుండాల నవీన్, ఈదురుబిల్లి సంతోష్తో కలిసి నేషనల్ ఎక్సైజ్ అనే మరో బెట్టింగ్ యాప్ అడ్మిన్ ఐడీ తీసుకున్నారు. సుమారు 200 మంది యువకులను పార్వతీపురం, విశాఖపట్నం జిల్లాల్లో వినియోగిస్తూ, బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. అంబటి రామ్మోహన్ అడ్మిన్గా, మహాంతి గణేష్, సామిరెడ్డి వాసు, కొట్టంగి మోహనరావు, మూడడ్ల పైడిరాజు, తాటి శంకరరావు ఏజెంట్లగా, గేదేల శ్రీనివాస్, సీరపు నారాయణరావు, తెర్లి మోహనరావు, కార్తీక్, నవీన్ యూజర్లగా ఉన్నారు. వీరిలో 11 మందిని అరెస్టు చేసి రూ.14.02 లక్షల నగదు, ల్యాప్టాప్, కారు, 13 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. మరో నలుగురు నిరంజన్రెడ్డి, సంతోష్, కార్తీక్, నవీన్ కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రధాన నిందితుడు ముషిడిపల్లి దివాకర్ ఏజెంట్లకు 3 శాతం కమీషన్ ఇవ్వడంతో పాటు, పొగొట్టుకున్న వ్యక్తి నగదులో 50 శాతం నగదును ఏజెంట్లకు ఇచ్చి వారిని బెట్టింగు యాప్ ప్రమోట్ చేసేందుకు ప్రొత్సహించే వాడని ఎస్పీ తెలిపారు. బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు చేయడంలో క్రీయాశీలకంగా పనిచేసిన బొబ్బిలి డీఎస్పీ భవ్య రెడ్డి, సీఐ సతీష్కుమార్, ఎస్ఐ ఆర్.రమేష్, కానిస్టేబుళ్లు సత్యనారాయణ, సతీష్కుమార్, ఎర్రంనాయుడు, అప్పారావును ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలు అందించారు. ఈ సమావేశంలో ఎస్బీ సీఐలు లీలారావు, ఆర్వీఆర్కే చౌదరి పాల్గొన్నారు.