Are the drugs good? మందులు మంచివేనా?
ABN , Publish Date - May 09 , 2025 | 12:06 AM
Are the drugs good? సాధారణంగా జలుబు దగ్గు వస్తే ఎక్కువ మంది ఆస్పత్రిని ఆశ్రయించరు. వీధి చివర్లో ఉన్న మందుల దుకాణానికి వెళుతుంటారు. అక్కడ ఇచ్చే మందులను వాడుతుంటారు. అయితే కడుపులో నొప్పి, గుండెల్లో మంట వంటి సమయాల్లో మాత్రం వెంటనే అప్రమత్తం అవుతారు. వైద్యుడ్ని ఆశ్రయిస్తారు. అయితే వైద్యుడు వైద్యసేవలు అందిస్తే చాలదు.. ఆయన రాసిన మందులు కూడా మంచివై ఉండాలి.
మందులు మంచివేనా?
కొనుగోలు సమయంలో జాగ్రత్తలు అవశ్యం
నకిలీలు, కాలం చెల్లినవి అంటగడుతున్న వైనం
ప్రజల ఆరోగ్యానికి ముప్పు
- రాజాంలో ఓ మెడికల్ దుకాణం వద్దకు డాక్టర్ ఇచ్చిన చీటీతో ఓ మహిళ మందుల కోసం వెళ్లింది. మెడికల్ షాపు సిబ్బంది చీటిలోని మందులు కాకుండా వేరేవి ఇచ్చారు. చౌకగా లభించే మందులు అందించి చేతులు దులుపుకున్నారు. ఆ డాక్టర్ కూడా ఇవి ఎందుకు తెచ్చావని ప్రశ్నించలేదు. ఎందుకంటే ఆ డాక్టర్కు, మెడికల్ షాపు నిర్వాహకులకు మధ్య ఒప్పందం ఉంది.
- బొబ్బిలిలో ఓ వ్యక్తి మెడికల్ షాపునకు వెళ్లి డాక్టర్ ఇచ్చిన చీటీని చూపించాడు. ఓ కంపెనీకి చెందిన టానిక్ అడిగాడు. ఆ షాపు యజమాని మాత్రం మరో కంపెనీకి చెందిన టానిక్ అందించాడు. దానికంటే ఇది మంచిగా పనిచేస్తుందని నమ్మబలికాడు. ఆ కంపెనీ టానిక్ అయితే వారికి 70 శాతం వరకూ లాభం వస్తుంది.
రాజాం, మే 8(ఆంధ్రజ్యోతి):
సాధారణంగా జలుబు దగ్గు వస్తే ఎక్కువ మంది ఆస్పత్రిని ఆశ్రయించరు. వీధి చివర్లో ఉన్న మందుల దుకాణానికి వెళుతుంటారు. అక్కడ ఇచ్చే మందులను వాడుతుంటారు. అయితే కడుపులో నొప్పి, గుండెల్లో మంట వంటి సమయాల్లో మాత్రం వెంటనే అప్రమత్తం అవుతారు. వైద్యుడ్ని ఆశ్రయిస్తారు. అయితే వైద్యుడు వైద్యసేవలు అందిస్తే చాలదు.. ఆయన రాసిన మందులు కూడా మంచివై ఉండాలి. నకిలీవి అయితే.. కొత్త జబ్బులు తోడవుతాయి. ఒక్కోసారి నిలువునా ప్రాణాలనే హరిస్తాయి. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలోనే నకిలీ మందుల చలామణి అధికమని వివిధ అధ్యయనాల్లో తేలింది. రెండు నెలల కిందట జిల్లా వ్యాప్తంగా ఔషధ తనిఖీలు జరిగాయి. పెద్ద ఎత్తున నకిలీ, కాలం చెల్లిన మందులు వెలుగులోకి వచ్చాయి. దీంతో కొద్దిరోజుల పాటు వీటి విషయంలో కట్టడి జరిగింది. మళ్లీ షరా మామూలే అన్నట్టు పరిస్థితి మారింది.
అప్పట్లో కట్టడి చేయక..
వైసీపీ హయాంలో నకిలీ మందుల కట్టడికి ఎటువంటి చర్యలు చేపట్టలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మందుల మాఫియాపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఇటీవల చాలా జిల్లాల్లో ఏకకాలంలో ఔషధ నియంత్రణ, విజిలెన్స్, పోలీస్ శాఖ సంయుక్తంగా తనిఖీలు చేపట్టాయి. మన జిల్లాకు సంబంధించి చాలా చోట్ల కాలం చెల్లిన మందులు, నకిలీ మందులు వెలుగుచూశాయి. దీంతో జిల్లాలో ప్రజారోగ్యం విషయంలో ఏ స్థాయిలో ప్రమాదం పొంచి ఉందో అర్థమవుతోంది.
కనీస నిబంధనలేవీ?
జిల్లాలో వందల కొద్దీ మందుల షాపులు ఉన్నాయి. చాలా వాటిలో నైపుణ్యం లేనివారే ఉంటున్నారు. అసలు మందుల షాపులు నిర్వహించేవారికి కూడా మందులపై అవగాహన లేని పరిస్థితి. డీ ఫార్మసీ చేసేవారి సర్టిఫికెట్ను ఏడాదికి ఇంత అని లీజుకు తీసుకుంటున్నారు. అదో వ్యాపారంగా మలుచుకొని సొమ్ము చేసుకుంటున్నారు. అయితే మందుల షాపుల్లో భారీ దోపిడీ జరుగుతున్నట్టు ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అస్సలు చలామణిలో లేనివి, కనీస అనుమతులు లేని కంపెనీల నుంచి మందులను తెప్పించి రోగులకు అంటగడుతున్నారు. ముఖ్యంగా మందుల దుకాణదారులు ఆర్ఎంపీలతో ఎక్కువగా ఒప్పందాలు చేసుకుంటున్నారు. వారి ద్వారా సైతం ఇటువంటి మందులు భారీగా చలామణి అవుతున్నట్టు తెలుస్తోంది.
త్వరలో జనరిక్ షాపులు..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజారోగ్యంపై దృష్టిపెట్టింది. అందులో భాగంగా భారీగా జనరిక్ మందుల షాపులు ఏర్పాటుచేయాలని భావిస్తోంది. డీ ఫార్మసీ పూర్తిచేసుకున్న బీసీ నిరుద్యోగ యువత షాపులు పెట్టుకునేందుకు వీలుగా బీసీ కార్పొరేషన్ నుంచి రుణాలు మంజూరు చేయనుంది. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ జరుగుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 40 వరకూ జనరిక్ మందుల షాపులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా జనరిక్ మందులకు ఆదరణ పెరుగుతోంది. ఇతర మందులతో పోల్చిస్తే జనరిక్ మందుల ధర కూడా చాలా తక్కువ.
దృష్టిపెట్టాం
మందుల షాపుల నిర్వహణలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవు. మార్చిలో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేశాం. విజయనగరంలో ఓ షాపులో రూ.2.11 లక్షల విలువైన మందులను సీజ్ చేశాం. షాపు నిర్వాహకులు నిబంధనలు పాటించాల్సిందే. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ మందుల దుకాణాలను నిరంతరం తనిఖీ చేస్తాం.
- రజిత, జిల్లా ఔషధ నియంత్రణ అధికారి, విజయనగరం
---------------