మానసిక వైద్యసేవలు అందుతున్నాయా?
ABN , Publish Date - Dec 17 , 2025 | 11:25 PM
జిల్లాలో మానసిక రోగులకు అందుతున్న వైద్య సేవలపై కేంద్ర పాపులేషన్ రీసెర్చ్ సెంటర్(పీఆర్సీ) సభ్యులు ఆరా తీశారు.
- కేంద్ర పీఆర్సీ సభ్యుల ఆరా
- జిల్లాలో పర్యటన
బెలగాం, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మానసిక రోగులకు అందుతున్న వైద్య సేవలపై కేంద్ర పాపులేషన్ రీసెర్చ్ సెంటర్(పీఆర్సీ) సభ్యులు ఆరా తీశారు. జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం అమల తీరును పరిశీలించేందుకు పీఆర్సీ సభ్యులు డాక్టర్ యడ్ల రమణ, డాక్టర్ చీపురుపల్లి పాదాలు జిల్లాలో బుధవారం పర్యటించారు. డీఎంహెచ్వో ఎస్.భాస్కరరావు, పోగ్రాం అధికారి డాక్టర్ టి.జగన్మోహన్రావు తదితర అధికారులతో సమావేశమై రోగులకు అందుతున్న మానసిక వైద్యసేవలు, పనితీరును అడిగి తెలుసుకున్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న డిస్టిక్ మెంటల్ హెల్త్ క్లినిక్ (బ్రెయిన్ హెల్త్ క్లినిక్)ను సందర్శించారు. ఈ క్లినిక్ ద్వారా అందుతున్న మానసిక వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించి సిబ్బందితో వివిధ అంశాల గురించి మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ శ్యామల, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రష్మిక, తదితర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.