Anemia రక్తహీనతను నివారించాలి
ABN , Publish Date - Sep 01 , 2025 | 11:35 PM
Anemia Should Be Prevented జిల్లాలో రక్తహీనత నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. అనీమియా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్లో మహిళలకు ఐరెన్ ఫోలిక్ యాసిడ్ మాత్రల పంపిణీ చేశారు.
పార్వతీపురం, సెప్టెంబరు1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రక్తహీనత నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. అనీమియా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్లో మహిళలకు ఐరెన్ ఫోలిక్ యాసిడ్ మాత్రల పంపిణీ చేశారు. 20 నుంచి 49 ఏళ్ల వయస్సు ఉన్న మహిళలు వారానికోసారి విధిగా ఈ మాత్రలు తీసుకోవా లన్నారు. మంగళవారం నుంచి జిల్లాలోని ప్రతి మహిళకు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది వాటిని అందిస్తారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వైశాలి, డీఆర్వో కె.హేమలత, డీఎంహెచ్వో ఎస్.భాస్కరరావు, డీఐవో జగన్మోహన్రావు, ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ, గిరిజన సంక్షేమశాఖ డీడీ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
కొఠియాపై నివేదిక ఇవ్వండి
కొఠియా గ్రామాల్లో ఆరోగ్య, తదితర శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై నివేదికలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి నియోజకవర్గానికి పది లక్షల రూపాయల మరమ్మతులు చేట్టేందుకు ప్రతిపాదనలు ఇవ్వాలన్నారు.
స్వామిత్వ గ్రామాలను సందర్శించాలి
జిల్లాలో స్వామిత్వ పనులు జరుగుతున్న గ్రామాలను మండల అధికారులు మంగళవారం సందర్శించాలని కలెక్టర్ శ్యామ్ప్రసాద్ ఆదేశించారు. స్వయంగా ఆయా పనులను తనిఖీ చేసి నివేదిక అందించాలన్నారు. నిరుద్యోగ యువతకు నచ్చిన రంగాల్లో నైపుణ్యం, శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కౌశలం పేరుతో సేకరించిన డేటాను ఎంపీడీవో, ఈవోపీఆర్డీలు పరిశీలించాలని సూచించారు. ఈటీటీఎస్ కింద ప్రభుత్వ కార్యాలయాల్లో జీవోలు, సర్క్యూలర్లు, ఇతర ఉత్తర్వులు తదితర వాటిని స్కానింగ్ చేసి అప్ లోడ్ చేయాలన్నారు. మండల అధికారులు పర్యవేక్షణలో రైతులకు ఎరువులు పంపిణీ అయ్యేలా చూడాలన్నారు.
అందుబాటులో 777 టన్నుల యూరియా
జిల్లాలోని రైతు సేవా కేంద్రాల్లో దాదాపు 777 టన్నుల యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం 250 టన్నుల యూరియాను మార్క్ఫెడ్కు సరఫరా చేశామని పేర్కొన్నారు. కాగా గడిచిన రెండు రోజుల్లో మార్క్ఫెడ్ బఫర్ నుంచి 256 టన్నులను జిల్లాలోని 21 రైతు సేవా కేం ద్రాలకు తరలించినట్టు చెప్పారు. బలిజిపేట మండలంలో 24 , భామిని 10 , జీఎల్పురం 20 , గరుగుబిల్లి 20 , జియ్యమ్మవలస 22 , కొమరాడ 24 , కురుపాం 12 , మక్కువ 12 , పాచిపెంట 36 , పాలకొండ 20 , పార్వతీపురం 12 , సాలూరు 12, సీతంపేట 20, సీతానగరానికి 12 టన్నుల చొప్పున యూరియా వచ్చినట్టు వివరించారు.
బూర్జలో పింఛన్ల పంపిణీ
సీతానగరం: బూర్జలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పంపిణీ చేశారు. సోమవారం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు పింఛన్ల నగదు అందించారు. అనంతరం ప్రజల స్పందనను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి, తహసీల్దార్, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.