ప్రీఎక్లంప్సియాపై అప్రమత్తం
ABN , Publish Date - May 22 , 2025 | 11:42 PM
గర్భిణుల్లో ప్రీఎక్లంప్సియా అనేది ఒక ప్రమాదకర సమస్య అని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి ఎస్.భాస్కరరావు అన్నారు.
- సకాలంలో లక్షణాలను గుర్తించాలి
- డీఎంహెచ్వో భాస్కరరావు
పార్వతీపురం, మే 22(ఆంధ్రజ్యోతి): గర్భిణుల్లో ప్రీఎక్లంప్సియా అనేది ఒక ప్రమాదకర సమస్య అని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి ఎస్.భాస్కరరావు అన్నారు. ప్రపంచ ప్రీఎక్లంప్సియా దినోత్సవం సందర్భంగా గురువారం ఆరోగ్య కార్యాలయ ప్రాంగణంలో అవగాహన కార్యక్రమం, ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భధారణ సమయంలో ఈ సమస్య వస్తుందని, సకాలంలో దీని లక్షణాలు గుర్తించాలని సూచించారు. బీపీ అధికంగా ఉండటం, తీవ్రమైన తలనొప్పి, దృష్టి సమస్య, ముఖం, చేతులు, కాళ్లు ఉబ్బడం, మూత్ర విసర్జన తగ్గడం, గ్యాస్ట్రిక్ నొప్పి వంటి లక్షణాలు ఉంటే తక్షణమే వైద్యులను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి.జగన్మోహన్రావు, డాక్టర్ పీఎల్.రఘుకుమార్, డీపీహెచ్ఎన్వో ఉషారాణి, వైద్యులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.