Admissions ప్రవేశాలు పెరగాలి
ABN , Publish Date - Jul 29 , 2025 | 11:51 PM
Admissions Should Increase జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్షించారు.
పార్వతీపురం, జూలై 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రవేశాలు తక్కువగా ఉన్నాయి. ఇంకా గడువు ఉన్నందున విద్యార్థులు చేరేలా ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి. ఈ నెలాఖరు నాటికి 1, 6, 11 తరగతుల్లో ప్రవేశాలు పెరగాలి. జీఎల్పురం, సాలూరు, పార్వతీపురం, పాలకొండ, సీతంపేట మండల విద్యాశాఖాధికారులు దీనిపై దృష్టి సారించాలి. ఒక్క విద్యార్థి కూడా ఆరుబయట ఉండరాదు. ప్రభుత్వం అం దిస్తున్న విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులను తల్లిదండ్రులకు వివరించి విద్యార్థులు చేరేలా చొరవ తీసుకోవాలి. పాఠశాలలు సమయపాలన పాటించాలి. సెలవుపై ఉపాధ్యాయులు వెళ్తే.. తాత్కాలికంగా సర్దుబాటు చేసుకోవాలి. ప్రతి పాఠశాల, కళాశాలలో విద్యుత్, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కచ్చితంగా ఉండాలి. ఉత్తీర్ణత శాతం పెంచాలి. ఆధార్ సమస్యలున్న చోట్ల పరిష్కరించి విద్యార్థులను చేర్పించాలి.’ అని తెలిపారు. అనంతరం ఆయన ‘ఇన్స్పైర్ మనక్ అవార్డు నామినేషన్లు-2025’కు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. పాఠశాల విద్యార్థుల్లో సృజనాత్మకత, నైపుణ్యం పెంపొందించ డానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. 6-12 తరతగుల విద్యార్థుల నుంచి ఐదు వినూత్న ఆలోచనలను సెప్టెంబరు లోగా ఇన్స్పైర్ మనక్ స్కీమ్ వెబ్ పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీఈవో బి.రాజ్కుమార్, డీఐఈవో వై.నాగేశ్వరరావు, గిరిజన సంక్షేమశాఖ డీడీ ఆర్.కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.