A year of great success ఘన విజయానికి ఏడాది
ABN , Publish Date - Jun 04 , 2025 | 12:09 AM
A year of great success ‘నరాలు తెగే ఉత్కంఠతో అందరూ టీవీలకు అతుక్కుపోయారు. ఎన్నికల ఫలితాల కోసం ఆర్తిగా ఎదురుచూశారు. తొలుత ఉద్యోగుల ఓట్ల లెక్కింపుతో ప్రారంభమైన కౌంటింగ్ గంటకు గంటకు టెన్షన్ పెట్టింది. కొన్ని రౌండ్ల తర్వాత ఒక్కో అడుగు విజయం వైపు పడింది. చివరకు విజయం ఏకపక్షమైంది. దీంతో కూటమి పార్టీల శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.
ఘన విజయానికి ఏడాది
ఏకపక్ష విజయంతో నాడు శ్రేణుల సంబరాలు
ఊహకందని ఫలితాలు.. ఐదేళ్ల అధిపత్యానికి చెక్
అదే ఐక్యతగా అడుగులేస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ
విజయనగరం/ రాజాం రూరల్, జూన్ 3(ఆంధ్రజ్యోతి):
‘‘నరాలు తెగే ఉత్కంఠతో అందరూ టీవీలకు అతుక్కుపోయారు. ఎన్నికల ఫలితాల కోసం ఆర్తిగా ఎదురుచూశారు. తొలుత ఉద్యోగుల ఓట్ల లెక్కింపుతో ప్రారంభమైన కౌంటింగ్ గంటకు గంటకు టెన్షన్ పెట్టింది. కొన్ని రౌండ్ల తర్వాత ఒక్కో అడుగు విజయం వైపు పడింది. చివరకు విజయం ఏకపక్షమైంది. దీంతో కూటమి పార్టీల శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. డిజాస్టర్ ఫలితాలతో వైసీపీ శ్రేణులు తీవ్ర నిరాశలో మునిగిపోయాయి’’ ఏడాది కిందట అంటే 2024 జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు ఆవిష్కృతమైన ఘటనలివి. జిల్లాలో కూటమి ఘన విజయం సాధించింది. అన్ని అసెంబ్లీ స్థానాలను క్లీన్స్వీప్ చేసింది.
అంచనాలను పటాపంచలు చేస్తూ..
గత ఏడాది సార్వత్రిక ఎన్నికల ముందు వెల్లడైన సర్వేలు రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పాయి కానీ విజయనగరం జిల్లాకు వచ్చేసరికి వైసీపీకి ఆధిక్యత రావొచ్చునన్నాయి. పథకాలు ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని, మహిళలు మొగ్గుచూపారని చెప్పుకొచ్చాయి. ఫలితాలు వచ్చేసరికి వార్ వన్సైడ్ అయిపోయింది. అన్నిచోట్లా కూటమి పాగా వేసింది. వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. బొత్స మంత్రాంగం పనిచేయలేదు. డిప్యూటీ స్పీకర్గా ఉన్న కోలగట్ల వీరభద్రస్వామిలాంటి సీనియర్లు టీడీపీ కూటమి ప్రభంజనం ముందు నిలబడలేకపోయారు. భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఆధిపత్యానికి చెక్..
ఐదేళ్లలో వైసీపీ చాలా దూకుడుగా వ్యవహరించింది. అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థల నుంచి మునిసిపల్ ఎన్నికల వరకు హవా చాటుకుంటూ వచ్చింది. అన్నింటా ఏకపక్షమే. జిల్లాలో 30 మండలాలకుగాను పది వరకూ జడ్పీటీసీలను ఏకగ్రీవం చేసుకుంది. విజయనగరం జిల్లా పరిస్థితులను చూసి నాడు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాదేశిక ఎన్నికలను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఐదేళ్ల పాటు సగటు టీడీపీ కార్యకర్త పడిన బాధలు వర్ణనాతీతం. ఆ అవమానాలు, కేసులు, అఘాయిత్యాలను చూసిన టీడీపీ శ్రేణులు ధైర్యంగా ముందుకు వచ్చి పోరాటం చేశాయి. అటు జనసేన అదనపు బలంగా నిలిచింది. బీజేపీ సాయం కూడా తోడైంది. కూటమిగా జత కట్టి వైసీపీని మట్టికరిపించారు.
ఊహకందని ఫలితాలు..
2024 సార్వత్రిక ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకున్నాయి. జనసేనకు ఉమ్మడి జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాలను కేటాయించాల్సి వచ్చింది. రెండు కూడా టీడీపీకి సంస్థాగతంగా బలమైనవే. అందులో నెల్లిమర్లను జనసేనకు కేటాయించారు. ఆ పార్టీ అభ్యర్థిగా లోకం నాగమాధవిని ఎంపిక చేశారు. దీనిపై తెలుగుదేశం నుంచి అభ్యంతరాలు వెళ్లాయి. అప్పటివరకూ టీడీపీ ఇన్చార్జిగా ఉన్న కర్రోతు బంగార్రాజు వర్గీయులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో తమ గెలుపు నల్లేరుమీద నడక అనుకుంది వైసీపీ. కానీ జనసేన, టీడీపీ సమన్వయం చేసుకోవడంతో చక్కటి విజయం సొంతం చేసుకుంది. విజయనగరం, గజపతినగరం, ఎస్.కోట, రాజాంలో ఉన్న టీడీపీ అంతర్గత విభేదాలతో తాము గట్టెక్కుతామని వైసీపీ నేతలు ధీమాతో ఉండేవారు. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. చీపురుపల్లిలో మనల్ని ఆపేదెవరు అన్నట్టు అప్పటి మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ సౌండ్ చేశారు. దీనికి చంద్రబాబు చక్కటి వ్యూహం అమలుచేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఉన్న కళా వెంకటరావును చీపురుపల్లికి షిఫ్ట్ చేశారు. ఎన్నికల ముంగిటే కళా వెంకటరావు అభ్యర్థిగా మారినా.. టీడీపీ నేతలు సమన్వయంతో వ్యవహరించడంతో కళావెంకటరావు గెలుపు నల్లేరు మీద నడకలా మారింది. కార్యకర్తలకు అసలుసిసలైన సంబరం దక్కింది.
సామాన్య నేత ఎంపీగా..
నాడు అందరికంటే విజయనగరం ఎంపీగా కలిశెట్టి అప్పలనాయుడు గెలుపు అందర్నీ సంభ్రమాశ్చర్యంలో ముంచింది. ఓ సామాన్య నాయకుడిగా ఉన్న కలిశెట్టి అప్పలనాయుడును సామాజిక సమీకరణల్లో భాగంగా ఎంపీ అభ్యర్థిగా అవకాశమిచ్చారు. ‘సామాన్యుడికి టికెట్ ఇచ్చాను. ఆయనకు ఒక అవకాశం ఇవ్వండి’ అంటూ చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన కోరినట్లే విశేషంగా మద్దతు పలికారు. దీంతో సిట్టింగ్ ఎంపీగా ఉన్న బెల్లాన చంద్రశేఖర్పై కలిశెట్టి భారీ విజయం సాధించారు.