సాగుకు ఊతం
ABN , Publish Date - Jun 25 , 2025 | 12:03 AM
వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. రైతులకు మేలు కలిగేలా నిర్ణయాలు తీసుకుంటోంది.
- 867 మంది రైతులకు యంత్ర, పరికరాలు
- వాటి విలువ రూ.4.53 కోట్లు
- ఖరీఫ్కు ముందే అందించిన ప్రభుత్వం
- ఆనందం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
రాజాం, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. రైతులకు మేలు కలిగేలా నిర్ణయాలు తీసుకుంటోంది. గత వైసీపీ ప్రభుత్వంలో నిలిచిపోయిన పథకాలు, రాయితీలను పునరుద్ధరించి సాగుకు ఊతమిస్తోంది. తాజాగా ఖరీఫ్ ప్రారంభంలోనే జిల్లా వ్యాప్తంగా 867 మంది రైతులకు రూ.4.53 కోట్ల విలువైన యంత్రాలు, పరికరాలు అందించింది. వాటి ద్వారా రైతులకు రూ.1.96 కోట్లు రాయితీ దక్కనుంది. మినీ ట్రాక్టర్లు, దమ్ము నాగళ్లు, దుక్కిసెట్లు, స్ర్పేయర్లు, కట్టర్లు, పవర్ టిల్లర్లు, వీడర్లు, రోటోవేటట్లు వంటి వాటిని అందించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నియోజకవర్గాల వారీగా ఇలా...
గజపతినగరం నియోజకవర్గంలో అత్యధికంగా 251 మంది రైతులకు రూ.1.37 కోట్ల విలువైన యంత్ర పరికరాలు అందించారు. బొబ్బిలిలో 183 మంది రైతులకు రూ.95 లక్షల విలువైనవి, రాజాంలో 178 మంది రైతులకు రూ.74 లక్షలు, ఎస్.కోటలో 84 మంది రైతులకు రూ.45 లక్షలు, నెల్లిమర్లలో 81 మందికి రూ.55 లక్షలు, చీపురుపల్లిలో 70 మందికి రూ.36 లక్షలు, విజయనగరం నియోజకవర్గంలో 20 మంది రైతులకు రూ.10.25 లక్షలు విలువచేసే యంత్ర పరికరాలు అందించారు.
అవన్నీ ఏమయ్యాయి?
వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ యంత్రా సేవా పథకం పేరిట జిల్లాకు 335 ట్రాక్టర్లను అందించినట్టు ఆ పార్టీ నేతలు గొప్పలు చెప్పారు. కానీ, అవి క్షేత్రస్థాయిలో ఎక్కడ ఉన్నావో తెలియడం లేదు. అప్పట్లో వైసీపీ నేతలే సమీప బంధువులు, అనుచరులను బినామీలుగా ఏర్పాటు చేసుకొని వాటిని కైవసం చేసుకున్నారు. అప్పట్లో తొలి విడతలో 326 గ్రూపులకు, రెండో విడతలో 184 గ్రూపులకు యంత్ర పరికరాలు అందించారు. మొదటి విడత అందించిన పరికరాల విలువ రూ.28.45 కోట్లు.. ఇందుకుగాను ప్రభుత్వం అందించిన రాయితీ రూ.9.34 కోట్లు, రెండో విడత పరికరాల విలువ రూ.15.10 కోట్లు.. రాయితీ రూ.4 కోట్లపైమాటే. అయితే ఇంత ఖర్చుపెట్టి అందించిన ట్రాక్టర్లు, పరికరాలు ఎక్కడున్నాయో తెలియడం లేదు. అసలు అవి మంజూరైనట్టు రైతులకు కూడా తెలియదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. వాటిని సైతం వినియోగంలోకి తెస్తే రైతులకు అదనపు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.
ఆనందంగా ఉంది..
ఖరీఫ్కు ముందుగానే ప్రభుత్వం యంత్రాలు, వాహనాలు అందించడం ఆనందంగా ఉంది. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆ పార్టీ సానుభూతిపరులకే యంత్రాలు, వాహనాలు అందించారు. ప్రస్తుతం అవి ఎక్కడున్నాయో కూడా తెలియడం లేదు. వాటన్నింటినీ వినియోగంలోకి తేవాలి.
-సాదేం శ్రీరామూర్తి, రైతు, కొప్పరవలస, వంగర
శుభ పరిణామం..
రాయితీపై యంత్ర పరికరాలు అందించడం శుభ పరిణామం. రైతులు ఆధునిక సాగు చేసేందుకు యంత్ర పరికరాలు ఎంతగానో దోహదపడతాయి. ఈ విషయంలో కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఖరీఫ్ ముంగిట వీటిని అందించడం ఎంతో బాగుంది.
-సామంతుల చిరంజీవినాయుడు, రైతు, రాజీయ్యపేట, రాజాం
రైతులు వినియోగించుకోవాలి
రైతులకు అన్నివిధాలా అండగా నిలుస్తాం. ఖరీఫ్ ప్రారంభానికి ముందే వ్యవసాయ పరికరాల పంపిణీ పూర్తయ్యింది. జిల్లా వ్యాప్తంగా 867 మంది రైతులకు వాటిని అందించాం. విత్తనాలు కొరత లేకుండా చూశాం. ఖరీఫ్కు అవసరమైన ఎరువులు కూడా అందుబాటులోకి తెస్తాం.
- వీటి రామారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, విజయనగరం