60 Packets… 133 Kilograms 60 ప్యాకెట్లు..133 కిలోలు
ABN , Publish Date - Aug 06 , 2025 | 11:53 PM
60 Packets… 133 Kilograms పార్వతీపురం మన్యం జిల్లా.. పాచిపెంట మండలం మాతూమూరు వద్ద గ్రీన్ఫీల్డ్ హైవే మీదుగా విజయనగరం వైపు ఆటోలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. అల్లూరి జిల్లాకు చెందిన ఇద్దర్ని అరెస్ట్ చేశారు.
అల్లూరి జిల్లాకు చెందిన ఇద్దరి అరెస్ట్
సాలూరు రూరల్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా.. పాచిపెంట మండలం మాతూమూరు వద్ద గ్రీన్ఫీల్డ్ హైవే మీదుగా విజయనగరం వైపు ఆటోలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. అల్లూరి జిల్లాకు చెందిన ఇద్దర్ని అరెస్ట్ చేశారు. బుధవారం సాలూరు రూరల్ పోలీస్స్టేషన్లో ఏఎస్పీ అంకితా సురాన తెలిపిన వివరాల ప్రకారం.. ముందస్తు సమాచారం మేరకు సాలూరు రూరల్ సీఐ పి.రామకృష్ణ ఆధ్వర్యంలో పాచిపెంట ఎస్.ఐ వెంకటసురేష్, సిబ్బంది మాతుమూరు వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవేలో వాహనాల తనిఖీ చేపట్టారు. అల్లూరి జిల్లా నుంచి మాతుమూరు సమీపంలో వేటగానివలస జంక్షన్కు వచ్చిన ఆటోను ఆపారు. దానిని విస్తృతంగా తనిఖీ చేయగా.. ఆటో సీటు కింద 60 ప్యాకెట్లలో 133 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆటోను సీజ్ చేసి అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం కొత్తలంగికి చెందిన కొర్ర డానియల్, పడాలపుట్టి వాసి జన్ని దివాకర్ను అరెస్ట్ చేశారు. మరో ఇరువురు నిందితులు కుమారుగుండికి చెందిన రాంబాబు, పరిసీలకు చెందిన కిరణ్లు మరో మార్గంలో శృంగవరపుకోటకు వెళ్లిపోయారని ఆమె తెలిపారు. పరారైన వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. సాలూరు రూరల్ సర్కిల్ పరిధిలో గడిచిన ఏడు నెలల్లో 1958 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో సాలూరు పట్టణ సీఐ బి.అప్పలనాయుడు, సాలూరు రూరల్ ఎస్ఐ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.