రికార్డులు తిరగరాసేలా యోగా డే
ABN , Publish Date - May 25 , 2025 | 01:19 AM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను వచ్చే నెల 21న అట్టహాసంగా, గత రికార్డులు తిరగరాసేలా నిర్వహించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి అన్నారు.
ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకూ 2.5 లక్షల మంది భాగస్వామ్యం
26.5 కి.మీ. పొడవునా 127 కంపార్టుమెంట్లు
కంపార్టుమెంటుకు 1,000 మంది
ప్రత్యామ్నాయంగా ఏయూలో వేదిక
ప్రజా ప్రతినిధులు, అధికారులతో ఇన్చార్జి మంత్రి, హోం మంత్రి సమీక్ష
విశాఖపట్నం, మే 24 (ఆంధ్రజ్యోతి):
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను వచ్చే నెల 21న అట్టహాసంగా, గత రికార్డులు తిరగరాసేలా నిర్వహించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి అన్నారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ యోగా వేడుకల్లో నగర పౌరులు, ఉద్యోగులు, విద్యార్థులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, నేవీ, కోస్టుగార్డు, యోగా అసోసియేషన్లు, వాకర్స్ అసోసియేషన్లు, వ్యాపారులు, విభిన్న ప్రతిభావంతులు, కార్మికులు...అందరూ పాల్గొనేలా అధికారులు చూడాలన్నారు.
కంపార్టుమెంటుకు 1,000 మంది...
యోగా వేడుకలకు సంబంధించి వివరాలను కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ సమావేశంలో వివరించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించాలంటే భాగస్వామ్యులంతా ఒకే వేదికపై కొనసాగాలని, మధ్యలో ఎక్కడా కనెక్టవిటీ తెగిపోకూడదన్నారు. అందువల్ల ఆర్కే బీచ్ రోడ్డులో కాళీమాత గుడి నుంచి భీమిలి వరకూ 26.5 కి.మీ. పొడవునా కార్యక్రమం నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు. ప్రధాన వేదిక కాళీమాత గుడి నుంచి వైఎంసీనే వరకూ ఉంటుందని, దీంట్లోనే ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారన్నారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 26.5 కి.మీ. పొడవునా 127 కంపార్టుమెంట్లు ఏర్పాటుచేస్తున్నామని, ప్రతి కంపార్టుమెంటులో 1,000 మంది పాల్గొంటారన్నారు. ప్రతి కంపార్టుమెంటుకు ఇన్చార్జి, 10 మంది వలంటీర్లు ఉంటారన్నారు. ప్రతిచోట చిన్న వేదిక, మైక్ సిస్టమ్, అభ్యాసకులు కనిపించేలా ఎల్ఈడీ స్ర్కీన్లు పెడతామన్నారు. తొమ్మిది కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా, 18.5 కి.మీ పొడవున రోడ్డుకు ఒకవైపు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రధాన రహదారిపై 1.24 లక్షల మందిని, మరొక 25 అదనపు వేదికల్లో మిగిలిన వారిని భాగస్వామ్యం చేస్తామన్నారు. ఆర్గానిక్ బ్రేక్ ఫాస్ట్ పెట్టేందుకు యోచిస్తున్నట్టు కలెక్టర్ వివరించారు. జిల్లాలో వివిధ యోగా అసోసియేషన్లతో సమన్వయం చేసుకుని మూడు దశల్లో శిక్షణ అందిస్తామని, ఇప్పటికే టీవోటీ, మాస్టర్ ట్రైనీలను గుర్తించామని, వారి ద్వారా మండల, గ్రామ స్థాయిల్లో శిక్షణ ఇస్తామన్నారు.
వర్షం వస్తే ప్రత్యామ్నాయంగా ఏయూలో వేదిక
ఒకవేళ జూన్ 21న వర్షం వస్తే కార్యక్రమం నిర్వహణకు ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ప్రధాని, గవర్నర్, సీఎం, మంత్రులు, ఇతర ప్రముఖులు పది వేల మంది యోగాసనాలు వేసేలా షెడ్లు వేస్తున్నామని, ఇవి జూన్ 12వ తేదీకల్లా అందుబాటులోకి వస్తాయన్నారు. వర్షం లేకపోతే వుడా పార్కు సర్కిల్ నుంచి చినవాల్తేర్ రోడ్డు, ఏయూ అవుట్గేటు మార్గం గుండా ఇంజనీరింగ్ కళాశాలకు అనుసంధానం చేస్తామన్నారు. సమీక్షలో ప్రభుత్వ విప్లు పి.గణబాబు, వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పి.విష్ణుకుమార్రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, ఏపీ కో-ఆపరేటివ్ ఆయిల్సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ, ఎన్టీఆర్ వైద్యసేవా వైస్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, డీసీపీలు అజిత వేజెండ్ల, మేరీ ప్రశాంతి, డీఆర్వో భవానీశంకర్, ఆర్డీవోలు శ్రీలేఖ, సంగీత్మాధుర్, నేవీ, కోస్టుగార్డు, జిల్లాలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.