కదంతొక్కిన కార్మికులు
ABN , Publish Date - Jul 10 , 2025 | 01:03 AM
కేంద్రం ప్రకటించిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు బుధవారం చేపట్టిన దేశ వ్యాప్త సమ్మె విశాఖపట్నంలో విజయవంతమైంది.
దేశవ్యాప్త సమ్మె విజయవంతం
కేంద్రం ప్రకటించిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్
విశాఖపట్నం, జూలై 9 (ఆంధ్రజ్యోతి):
కేంద్రం ప్రకటించిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు బుధవారం చేపట్టిన దేశ వ్యాప్త సమ్మె విశాఖపట్నంలో విజయవంతమైంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగ పరిశ్రమల్లో అసంఘటిత కార్మికులు విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దొండపర్తిలోని రైల్వే డీఆర్ఎం కార్యాలయం నుంచి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా గల గాంధీ విగ్రహం వరకూ ర్యాలీ నిర్వహించారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన పథకం, స్కూల్ శానిటేషన్ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఆటో, మోటార్, భవన నిర్మాణ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, కనీస పెన్షన్ రూ.9,500 ఇవ్వాలన్నారు. సమ్మెకు సీపీఎం, సీపీఐ, ఇతర వామపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఇన్సూరెన్స్ ఉద్యోగుల సంఘాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి.