మహిళా క్రికెట్ సందడి
ABN , Publish Date - Oct 04 , 2025 | 12:53 AM
ఐసీసీ మహిళల వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా అక్టోబరు 9 నుంచి జరగనున్న ఐదు మ్యాచ్లకు టికెట్ల అమ్మకాలు ఆన్లైన్ (బుక్ మై షో)లో మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి.
ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఐదు వరల్డ్ కప్ మ్యాచ్లు
9న భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి మ్యాచ్
ఆన్లైన్ టికెట్ల అమ్మకాలు
విశాఖపట్నం-స్పోర్ట్స్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి):
ఐసీసీ మహిళల వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా అక్టోబరు 9 నుంచి జరగనున్న ఐదు మ్యాచ్లకు టికెట్ల అమ్మకాలు ఆన్లైన్ (బుక్ మై షో)లో మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. స్టేడియంలోని సి, డి, ఈ, ఈ1, ఎఫ్, జి, హెచ్, కె, ఐ, కె, ఎం స్టాండ్స్కు సంబంధించిన టికెట్లను (రూ.100), అలాగే ప్లేయర్ పెవెలియన్ వైపు గల సౌత్ వెస్ట్ అప్పర్, సౌత్ ఈస్ట్ అప్పర్ స్టాండ్లకు (గ్యాలరీ) సంబంధించి టికెట్ల (రూ.499)ను ఆన్లైన్లో అమ్మకాలకు ఉంచారు.
భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్కు టికెట్ ధర రూ.150
మ్యాచ్ల ఏర్పాట్లలో భాగంగా శుక్రవారం స్టేడియంలో కలెక్టర్ హరేంధరప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, పోలీస్ కమిషనర్ శంకభ్రాత బాగ్చి, డీసీపీ-2 మేరీ ప్రశాంతి, ఏసీఏ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరేంధర్ప్రసాద్ మాట్లాడుతూ స్టేడియం చుట్టూ తగిన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సీసీ టీవీ నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏసీఏ ప్రతినిధులు మాట్లాడుతూ టికెట్ ధర ఈనెల 9న భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న మ్యాచ్కు రూ.150గా, మిగిలిన మ్యాచ్లకు రూ.100గా నిర్ణయించామన్నారు.
మ్యాచ్లు...
అక్టోబరు 9న భారత్-దక్షిణాఫ్రికా, 12న భారత్-ఆస్ర్టేలియా, 13న దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్, 16న ఆస్ర్టేలియా-బంగ్లాదేశ్, 26న ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్లు జరగనున్నాయి.