రైలు ఎక్కుతూ జారిపడి మహిళ మృతి
ABN , Publish Date - May 26 , 2025 | 12:35 AM
హైదరాబాద్ శివారులోని చర్లపల్లి శాటిలైట్ రైల్వే స్టేషన్లో ఆదివారం ఉదయం జరిగిన ప్రమాదంలో మండలంలోని దొండపూడి గ్రామానికి చెందిన మహిళ మృతిచెందింది. తాను ప్రయాణిస్తున్న రైలులో ఒక బోగీ నుంచి మరొక బోగీలో మారే క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాలిలా వున్నాయి.
మృతురాలి స్వగ్రామం దొండపూడి
హైదరాబాద్ శివారు చర్లపల్లి స్టేషన్లో ఘటన
భర్త ఉద్యోగ రీత్యా హైదరాబాద్లో నివాసం
వేసవి సెలవులకు వస్తుండగా ఘటన
రావికమతం, మే 25 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ శివారులోని చర్లపల్లి శాటిలైట్ రైల్వే స్టేషన్లో ఆదివారం ఉదయం జరిగిన ప్రమాదంలో మండలంలోని దొండపూడి గ్రామానికి చెందిన మహిళ మృతిచెందింది. తాను ప్రయాణిస్తున్న రైలులో ఒక బోగీ నుంచి మరొక బోగీలో మారే క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాలిలా వున్నాయి.
మండలంలోని దొండపూడికి చెందిన గట్టా వెంకటేశ్ హైదరాబాద్ మియాపూర్ ప్రాంతంలోని ఒక ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య శ్వేత (33), పిల్లలు రిత్విక్, చేతన్లతో కలిసి గండి మైసమ్మ ప్రాంతంలో నివాసం వుంటున్నాడు. స్కూళ్లకు వేసవి సెలవులు కావడంతో ఆదివారం దొండపూడి రావాలనుకున్నారు. పిల్లలిద్దరినీ తీసుకుని శ్వేత ఆదివారం ఉదయం లింగంపల్లి రైల్వే స్టేషన్కు వెళ్లింది. ముందుగానే రిజర్వేషన్ చేయించుకున్నప్పటికీ వీరు స్టేషన్కు వెళ్లేసరికి రైలు బయలుదేరుతున్నది. దీంతో హడావిడిగా జనరల్ బోగీ ఎక్కేశారు. సుమారు గంట తరువాత రైలు చర్లపల్లి స్టేషన్కు చేరుకుని ఆగింది. దీంతో శ్వేత, ఇద్దరు పిల్లలతో సాధారణ బోగీ నుంచి దిగి రిజర్వేషన్ చేయించుకున్న బోగీ దగ్గరలోకి చేరుకుంది. అయితే రైలు కదలడంతో.. పిల్లలను బోగీలోకి ఎక్కించి, తాను కూడా ఎక్కబోయింది. ఈ క్రమంలో పట్టుతప్పి బోగీకి, ప్లాట్ ఫారానికి మధ్యలో ఇరుక్కుపోయి కిందకు జారిపోయింది. తీవ్రంగా గాయడడంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఈ విషయం దొండపూడిలోని కుటుంబ సభ్యులకు తెలియడంతో వెంకటేశ్ తండ్రి అప్పారావు, తల్లి ముసలమ్మ కుప్పకూలిపోయారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి బంధువులు ఇక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.