Share News

కాఫీ ఎకో పల్పింగ్‌ యూనిట్‌ నిర్మాణం జరిగేనా?

ABN , Publish Date - Aug 26 , 2025 | 12:49 AM

మండల కేంద్రంలో ఐటీడీఏ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాఫీ ఎకో పల్పింగ్‌ యూనిట్‌ నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. నాలుగేళ్ల క్రితం ఐటీడీఏ ఎకో పల్పింగ్‌ యూనిట్‌ నిర్మాణ పనులు ప్రారంభించింది.

కాఫీ ఎకో పల్పింగ్‌ యూనిట్‌ నిర్మాణం జరిగేనా?
పిల్లర్ల స్థాయిలోనే ఉన్న ఎకో పల్పింగ్‌ యూనిట్‌ భవనం

నాలుగేళ్లయినా పూర్తికాని పనులు

గత వైసీపీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడమే కారణం

తుప్పుపడుతున్న యంత్రాలు

మూడు నెలల్లో ప్రారంభంకానున్న కాఫీ పండ్ల సీజన్‌

అప్పటిలోగా అందుబాటులోకి తేవాలని రైతుల వేడుకోలు

గూడెంకొత్తవీధి, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో ఐటీడీఏ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాఫీ ఎకో పల్పింగ్‌ యూనిట్‌ నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. నాలుగేళ్ల క్రితం ఐటీడీఏ ఎకో పల్పింగ్‌ యూనిట్‌ నిర్మాణ పనులు ప్రారంభించింది. అయితే గత వైసీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. నాటి నుంచి మొండిగోడలతో పల్పింగ్‌ యూనిట్‌ దర్శనమిస్తున్నది. అలాగే రూ.లక్షలు నిధులు వెచ్చించి కొనుగోలు చేసిన యంత్రాలు తుప్పుపడుతున్నాయి. మరో మూడు నెలల్లో కాఫీ పండ్ల సీజన్‌ ప్రారంభం కానున్నది. కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ ఏడాది సీజన్‌ నాటికి కాఫీ ఎకో పల్పింగ్‌ యూనిట్‌ అందుబాటులోకి తీసుకు వస్తే ఉపయోగకరంగా ఉంటుందని రైతులు అంటున్నారు.

గిరిజన రైతులు పండించిన కాఫీ పండ్ల నుంచి నాణ్యమైన పార్చిమెంట్‌ ఉత్పత్తి చేసేందుకు చింతపల్లి కాఫీ ఎకో పల్పింగ్‌ యూనిట్‌ తరహాలో రూ.1.3 కోట్ల ట్రైకార్‌ నిధులతో గూడెంకొత్తవీధి మండల కేంద్రంలోనూ నిర్మించేందుకు ఐటీడీఏ 2021లో పనులు ప్రారంభించింది. మూడు నెలల్లో పనులు పూర్తి చేయాలని ఐటీడీఏ లక్ష్యాన్ని నిర్దేశించింది. 2022 కాఫీ సీజన్‌ నాటికే ఎకో పల్పింగ్‌ యూనిట్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని ఐటీడీఏ అధికారులు ప్రకటించారు. అయితే నిర్మాణాలకు సంబంధించిన నిధులను గత వైసీపీ ప్రభుత్వం సకాలంలో విడుదల చేయకపోవడం వలన కాంట్రాక్టర్‌ పనులను నిలిపివేశారు.

నిరుపయోగంగా యంత్రాలు

ఎకో పల్పింగ్‌ యూనిట్‌ నిర్మాణ పనులు అర్ధంతరంగా నిలిచిపోవడంతో పల్పింగ్‌ కోసం కొనుగోలు చేసిన యంత్రాలు నిరుపయోగంగా పడి వున్నాయి. ఎకో పల్పింగ్‌ యూనిట్‌కి అవసరమైన యంత్రాలను సుమారు రూ.20 లక్షలతో కొనుగోలు చేశారు. యూనిట్‌ నిర్మాణం పూర్తికాకపోవడం వలన యంత్రాలు ఇన్‌స్టాల్‌ చేసే పరిస్థితి లేదు. ప్రస్తుతం యంత్రాలు తుప్పుపడుతున్నాయి. ప్రధానంగా ఎకో పల్పింగ్‌ యూనిట్‌ వద్ద పైకప్పు నిర్మాణం, యంత్రాలు ఇన్‌స్టాల్‌ చేసేందుకు విద్యుత్‌ సరఫరా ఉండాలి. ఎకో పల్పింగ్‌ యూనిట్‌కి విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకోవడానికి ఈపీడీసీఎల్‌ అధికారులకు సుమారు రూ.8 లక్షలు చెల్లించాలి. విద్యుత్‌ కనెక్షన్‌కి సంబంధించిన నిధులు సైతం ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో ఎకో పల్పింగ్‌ యూనిట్‌ వద్ద పనులు చేపట్టే అవకాశంలేకుండాపోయింది.

కాఫీ ఉత్పత్తిలో అగ్రస్థానం

జిల్లాలో గూడెంకొత్తవీధి మండలం కాఫీ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. మండలంలో ఆదివాసీ రైతులు అత్యధికంగా 42 వేల ఎకరాల్లో కాఫీ సాగు చేపడుతున్నారు. సరైన సేద్య పద్ధతులు పాటించకపోవడం వలన ఆశించిన దిగుబడులు రాకపోయినప్పటికి ప్రతి ఏడాది 4,200 టన్నుల క్లీన్‌ ఉత్పత్తి చేస్తున్నారు. ఐటీడీఏ సహకరంతో మ్యాక్స్‌ కాఫీ పండ్లకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తున్నది. గత ఏడాది కిలో కాఫీ పండ్లకు గరిష్ఠ ధరను అందజేశారు. గిరిజన రైతులు కాఫీ పండ్లను మ్యాక్స్‌ ద్వారా మార్కెటింగ్‌ చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. మండల కేంద్రంలో ఎకో పల్పింగ్‌ యూనిట్‌ అందుబాటులోకి రాకపోవడం వలన మండలానికి చెందిన ఆదివాసీలు పండించిన కాఫీ పండ్లను చింతపల్లి ఎకో పల్పింగ్‌ యూనిట్‌కు తరలించాల్సి వస్తున్నది. దీంతో రవాణా ఖర్చు పెరుగుతున్నది. దీని వలన రైతులకు వచ్చే బోసస్‌ తగ్గే అవకాశమున్నది.

ఎకో పల్పింగ్‌ యూనిట్‌ అందుబాటులోకి వస్తే..

గూడెంకొత్తవీధి మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఎకో పల్పింగ్‌ యూనిట్‌ అందుబాటులోకి వస్తే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆదివాసీలు కాఫీ తోటల నుంచి సేకరించిన పండ్లను వెనువెంటనే ఎకో పల్పింగ్‌ యూనిట్‌కి తరలించే అవకాశముంటుంది. చింతపల్లికి తరలించే రవాణా భారం తగ్గుతుంది. రైతులు ప్రైవేటు వర్తకులను ఆశ్రయించకుండా సేకరించిన పండ్లను పూర్తి స్థాయిలో మ్యాక్స్‌ ద్వారా మార్కెటింగ్‌ చేసుకునే అవకాశం కలుగుతుంది. రైతులు చెర్రీగా విక్రయించుకోకుండా మెజారిటీ పండ్లను పార్చిమెంట్‌గా విక్రయించుకుని గరిష్ఠ ధర పొందే అవకాశముంటుంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం, ఐటీడీఏ అధికారులు స్పందించి కాఫీ ఎకో పల్పింగ్‌ యూనిట్‌ను ఈ సీజన్‌ ప్రారంభానికి ముందుగానే అందుబాటులోకి తీసుకొని రావాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Aug 26 , 2025 | 12:49 AM