భూసార పరీక్షా కేంద్రం తెరుచుకునేదెన్నడో?
ABN , Publish Date - Jun 14 , 2025 | 01:15 AM
నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో నాలుగేళ్ల క్రితం మూతపడిన భూసార పరీక్షా కేంద్రం తెరుచుకోకపోవడంపై రైతుల నుంచి సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
నాలుగేళ్ల క్రితం మూతపడిన నర్సీపట్నం కేంద్రం
మట్టి నమూనాలకు అనకాపల్లి ఎస్టీఎల్లో పరీక్షలు
ఏటా ఖరీఫ్కి ముందు మట్టి నమూనాల సేకరణ
నర్సీపట్నం సబ్ డివిజన్లో 5,242 నమూనాలు సేకరించి రైతు సేవా
కేంద్రాల ద్వారా అనకాపల్లి తరలింపు
నర్సీపట్నం, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో నాలుగేళ్ల క్రితం మూతపడిన భూసార పరీక్షా కేంద్రం తెరుచుకోకపోవడంపై రైతుల నుంచి సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రతీ ఏటా ఖరీఫ్కి ముందు మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షా కేంద్రాలలో పరీక్షలు చేసి పోషకాల వినియోగంపై రైతులకు సూచనలు చేస్తారు. ఇక్కడ భూసార పరీక్షా కేంద్రం మూతపడడంతో అనకాపల్లి పంపించి పరీక్షలు చేయాల్సి వస్తుంది. దీని వలన పరీక్షల ఫలితాలు రావడంలో జాప్యం అవుతోంది.
సబ్ డివిజన్లో 5,242 నమూనాలు సేకరణ
వ్యవసాయ శాఖ ఏడీఏ పరిధిలో ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం మేరకు నర్సీపట్నంలో 912, గొలుగొండలో 850, రోలుగుంటలో 880, రావికమతంలో 1,210, వి.మాడుగులలో 1,390 నమూనాలు సేకరించి రైతు సేవా కేంద్రాల ద్వారా అనకాపల్లిలోని భూసార పరీక్షా కేంద్రానికి పంపించారు. గత రెండేళ్లుగా మట్టి నమూనాలు తీయని రైతుల భూములు గుర్తించి ఈ సంవత్సరం భూసార పరీక్షలకు నమూనాలు సేకరించారు. ఏ ప్రాంతంలో మట్టి నమూనా సేకరిస్తున్నారో ఆ రైతు జియో టాగింగ్తో ఫొటో తీసి అప్లోడ్ చేశారు. ప్రతీ నమూనాకు క్యూఆర్ కోడ్ ఇచ్చారు. దాని మీద స్కాన్ చేస్తే వివరాలు అన్ని తెలుస్తాయి. ఫలితాలు నెలాఖరుకు రావచ్చని ఏడీ శ్రీదేవి చెప్పారు.
కూటమి ప్రభుత్వంలో ప్రతిపాదనలు
గత వైసీపీ ప్రభుత్వంలో భూసార పరీక్షా కేంద్రం మూతపడింది. అందులోని సామగ్రి అంతా పాడైంది. నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన అగ్రి ల్యాబ్లలో భూసార పరీక్షలు కూడా చేస్తారని ప్రకటించారు. అయితే కార్యరూపం దాల్చలేదు. దీంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడీఏ శ్రీదేవి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. జడ్పీటీసీ సుకల రమణమ్మ సైతం జడ్పీ సమావేశంలో ఈ సమస్యను లేవనెత్తారు.
ఉపయోగాలు ఇవీ...
భూసార పరీక్షల వలన నేలలో సహజంగా ఉండే పోషకాల స్థాయిని తెలుసుకోచ్చు. నారు మడులు సిద్ధం చేసుకొని దమ్ము పట్టి పంట వేయబోయే ముందు ఎంత మోతాదులో ఎరువులు వేయాలో పరీక్షల ద్వారా తెలుస్తుంది.
ఎరువులు మోతాదుకి మించి వాడడం వలన రైతు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు భూసారం మీద ప్రభావం పడుతుంది. అందు వలన భూసార పరీక్షలు చేసి ఎంత మోతాదులో పోషకాలు ఉన్నాయో నిర్ధారణ చేస్తారు.