నీటి సరఫరా కార్మికుల సమ్మె విరమణ
ABN , Publish Date - Jun 29 , 2025 | 12:30 AM
జీతాల పెంపును అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈనెల 27 నుంచి సమ్మెకు దిగిన జీవీఎంసీ నీటి సరఫరా విభాగం అవుట్సోర్సింగ్ కార్మికులు తమ ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నట్టు శనివారం ప్రకటించారు.
వచ్చే నెల రెండో తేదీ నాటికి పెరిగిన జీతాలు ఇస్తామని మేయర్ పీలా హామీ
హామీ అమలు చేయకపోతే మూడో తేదీ నుంచి మళ్లీ సమ్మెకు దిగుతామని యూనియన్ ప్రతినిధులు హెచ్చరిక
నగరంలో పునఃప్రారంభమైన నీటి సరఫరా
విశాఖపట్నం, జూన్ 28 (ఆంధ్రజ్యోతి):
జీతాల పెంపును అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈనెల 27 నుంచి సమ్మెకు దిగిన జీవీఎంసీ నీటి సరఫరా విభాగం అవుట్సోర్సింగ్ కార్మికులు తమ ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నట్టు శనివారం ప్రకటించారు. కాంట్రాక్టు ఉద్యోగులు మరియు లేబర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఎం.ఆనందరావుతో మేయర్ పీలా శ్రీనివాసరావు శనివారం తన నివాసంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నీటి సరఫరా నిలిచిపోవడం వల్ల నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, యోగాంధ్ర కారణంగా కార్మికుల వేతనాల పెంపుపై దృష్టిపెట్టడానికి వీల్లేకుండా పోయిందని మేయర్ వివరించారు. తనకు వచ్చే నెల రెండో తేదీ వరకూ అవకాశం ఇవ్వాలని, అధికారులతో చర్చించి కౌన్సిల్ తీర్మానంలో పేర్కొన్నట్టుగా పెరిగిన జీతాలతో కూడిన బిల్లులను జూన్ నెలకు వర్తించేలా వెబ్సైట్లో అప్లోడ్ చేయిస్తానని హామీ ఇచ్చారు. తక్షణం సమ్మెను విరమించి విధుల్లో చేరాలని కోరారు. జనవరి నుంచి ఎరియర్స్ను కూడా నెల రోజుల్లోగా కార్మికులకు అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో కార్మికులంతా తమ సమ్మెను తాత్కాలికంగా విరమించి విధుల్లో చేరడానికి సమ్మతించారు. రెండో తేదీలోగా హామీని అమలు చేయకపోతే మూడో తేదీ నుంచి తిరిగి పూర్తిస్థాయి సమ్మెలోకి వెళతామని ఆనందరావు స్పష్టంచేశారు. అనంతరం కార్మికులు యథావిధిగా తమ విధుల్లో చేరిపోవడంతో నగరంలో నీటి సరఫరా ప్రక్రియ తిరిగి ప్రారంభమైంది. కార్మికుల సమ్మె కారణంగా శుక్ర, శనివారాల్లో నగరంలోని అనేక ప్రాంతాలకు నీటిసరఫరా నిలిచిపోయిన విషయం తెలిసిందే. కాగా సీఐటీయూ గౌరవ అధ్యక్షుడు పి.వెంకటరెడ్డి మాట్లాడుతూ కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి సమ్మెకు దిగడంతో జీవీఎంసీ అధికారులతోపాటు మేయర్ పీలా శ్రీనివాసరావు దిగివచ్చి, హామీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇది కార్మికుల సమిష్టి విజయమని అభివర్ణించారు.