తాండవ ఆయకట్టుకు రెండో వారంలో నీటి విడుదల
ABN , Publish Date - Jul 22 , 2025 | 01:25 AM
ఖరీఫ్ సీజన్లో తాండవ జలాశయం నుంచి ఆయకట్టుకు వచ్చే నెల రెండో వారంలో నీటిని విడుదల చేయనున్నట్టు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కరక సత్యనారాయణ తెలిపారు.
ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కరక సత్యనారాయణ
నీటి సంఘాలు, రైతులతో సమావేశం
త్వరలో తేదీ ఖరారు
నాతవరం, జూలై 21 (ఆంధ్రజ్యోతి):
ఖరీఫ్ సీజన్లో తాండవ జలాశయం నుంచి ఆయకట్టుకు వచ్చే నెల రెండో వారంలో నీటిని విడుదల చేయనున్నట్టు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కరక సత్యనారాయణ తెలిపారు. ఆయకట్టుకు నీటి విడుదలపై సోమవారం ప్రాజెక్టు అధికారులు, నీటి సంఘాల అధ్యక్షులు, రైతులతో ఇక్కడ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ఆగస్టు ఏడు తరువాత 15వ తేదీలోపు నీటి విడుదలను ప్రారంభించాలని కోరారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ, ప్రస్తుతం తాండవ రిజర్వాయర్లో 370 అడుగుల మేర నీటినిల్వలు ఉన్నాయని తెలిపారు. ఏ తేదీన నీటిని విడుదల చేసేది త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. పండుగ వాతావరణంలో జలహారతి ఇచ్చి కాలువలకు నీటిని విడుదల చేస్తామన్నారు. పంట కాలువల్లో ఈ ఏడాది సుమారు రూ.6 కోట్లతో పలురకాల పనులు చేయించామని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది మరిన్ని నిధులు మంజూరు చేస్తానని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అంతకుముందు మన్యపురట్ల నీటి సంఘం అధ్యక్షుడు అపన్న దివాణం మాట్లాడుతూ, నిమ్మకట్టు ఛానెల్కు తలుపుల ఏర్పాటుకు నిధులు మంజూరు అయినప్పటికీ ఇంకా పనులు మొదలు పెట్టలేదన్నారు. ఇండిపల్లి మేజర్ కాలువ గట్టును కొంతమంది ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్నారని, అలాగే నిమ్మకట్టు ఛానెల్ గట్లపై కొందరు జీడిమామిడి తోటలు వేశారని, ప్రాజక్టు అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఆక్రమణలను తొలగించాలని కోరారు. కోటవురట్ల పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జి వేచలపు జనార్దన్ మాట్లాడుతూ, కాలువ చివరి భూములకు నీరు సరిగా అందడం లేదని, ఈ ఏడాది సమస్యను పరిష్కరించాలని కోరారు. సమావేశంలో ప్రాజెక్టు కమిటీ వైస్చైర్మన్ జోగిబాబు, మాజీ చైర్మన్ పారుపల్లి కొండబాబు, డీఈఈ అనురాధ, ఏఈ శ్యామ్, టీడీపీ నాయకులు నందిపల్లి వెంకటరమణ, ఎన్.విజయ్కుమార్, అంకంరెడ్డి రమేశ్, పారుపల్లి దాసు, మాణిక్యం, సీతారామ్మూర్తి, తదితరులు పాల్గొన్నారు.