Share News

నీటి ప్రాజెక్టులకు గండం

ABN , Publish Date - May 10 , 2025 | 12:40 AM

నగరవాసులకు తాగునీరు అందించే ప్రాజెక్టుల నిర్వహణకు నిధులు లేక జల వనరుల శాఖ నానా ఇబ్బందులు పడుతుంది.

నీటి ప్రాజెక్టులకు గండం

  • గత కొన్నేళ్లుగా నిర్వహణ నిల్‌

  • శిధిలావస్థకు చేరుకున్న జలాశయాల గేట్లు వర్షాకాలంలోగా మరమ్మతులు చేయకుంటే కష్టమే

  • నీరు తీసుకుని అమ్ముకుంటూ కూడా పట్టించుకోని జీవీఎంసీ

  • బకాయిల చెల్లింపు కోసం 2008 నుంచి లేఖలు రాస్తున్న జల వనరుల శాఖ

  • మొత్తం రూ.210.83 కోట్లు

  • నగర పాలక సంస్థ నుంచి బకాయిలు రాబట్టుకోవాలని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ లేఖ

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి):

నగరవాసులకు తాగునీరు అందించే ప్రాజెక్టుల నిర్వహణకు నిధులు లేక జల వనరుల శాఖ నానా ఇబ్బందులు పడుతుంది. వైసీపీ పాలనలో ప్రాజెక్టుల నిర్వహణను గాలికొదిలేయడంతో వాటి పరిస్థితి అధ్వానంగా మారింది. ఈ ఏడాది వర్షాకాలంలోగా రైవాడ, మేహాద్రిగెడ్డ రిజర్వాయర్ల గేట్లు మరమ్మతులు చేయకపోతే ప్రమాదమని జల వనరుల శాఖ ఇంజనీర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గేట్ల మరమ్మతులకు నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, జీవీఎంసీ నుంచి బకాయిలు వసూలు చేసుకోవాలని సలహా ఇచ్చింది. జీవీఎంసీ నుంచి రూ.210.83 కోట్లు రావలసి ఉన్నట్టు జల వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.

నగరానికి తాగునీరు, గ్రామీణ ప్రాంతంలో రైతులకు సాగునీటి కోసం దశాబ్దాల క్రితం రైవాడ, మేహాద్రిగెడ్డ, తాటిపూడి, గంభీరం జలాశయాలను నిర్మించారు. గంభీరం తప్ప రైవాడ, మేహాద్రిగెడ్డ, తాటిపూడి నుంచి ఏడాది పొడవునా నగర అవసరాలకు నీరు సరఫరా అవుతుంది. గంభీరం నుంచి నాలుగు నెలలు నీరు అందుతుంది. ప్రస్తుతం రైవాడ నుంచి 27 ఎంజీడీ (మిలియన్‌ గ్యాలన్స్‌ పర్‌ డే) తాటిపూడి నుంచి 11, మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ నుంచి 8, గంభీరం నుంచి 2...మొత్తం 48 ఎంజీడీల నీరు నగరానికి సరఫరా చేస్తున్నారు. ప్రాజెక్టుల నుంచి వచ్చే నీటిని జీవీఎంసీ శుద్ధి చేసి ప్రజలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు విక్రయిస్తోంది. నీరు సరఫరా చేసే ప్రాజెక్టుల నిర్వహణ, ఉద్యోగులకు జీతాలు, మరమ్మతులు బాధ్యత మాత్రం జల వనరుల శాఖ చూసుకోవాల్సి ఉంటుంది. అయితే నీటిని వ్యాపార అవసరాలకు విక్రయిస్తున్న జీవీఎంసీ...జల వనరుల శాఖకు మాత్రం సొమ్ములు చెల్లించడం లేదు. తాటిపూడి రిజర్వాయర్‌ నుంచి వచ్చే నీటికి ఎప్పటికప్పుడు సొమ్ములు చెల్లిస్తున్నా మేహాద్రిగెడ్డ, రైవాడ, గంభీరం విషయం పట్టించుకోవడం లేదు.

బకాయిల చెల్లించాలని కోరుతూ జీవీఎంసీకి జల వనరుల శాఖ ఏటా ఒకటి లేదా రెండుసార్లు లేఖలు రాస్తోంది. జల వనరుల శాఖ వద్ద ఉన్న సమాచారం మేరకు 2008 డిసెంబరు 10న తొలిసారిగా లేఖ రాశారు. చివరగా గత ఏడాది నవంబరు 12 వరకు సుమారు 30 లేఖలు రాసింది. గత ఏడాది మాత్రం రూ.1.2 కోట్లు విడుదల చేసింది. తాజాగా బకాయిలపై లెక్కలు తీయగా రైవాడ ప్రాజెక్టుకు సంబంధించి రూ.156 కోట్లు, మేహాద్రిగెడ్డకు రూ.49.73 కోట్లు, గంభీరం ప్రాజెక్టుకు రూ. 4.39 కోట్లు, తాటిపూడికి రూ.0.74 కోట్లు చెల్లించాల్సి ఉంది.

మరో రెండు నెలల్లో వర్షాకాలం ప్రారంభం కానున్నందున రైవాడ, మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ గేట్లు కొన్నింటికి తక్షణమే మరమ్మతులు చేయాల్సి ఉందని, నిధులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని జల వనరుల శాఖ కోరింది. ఆ రెండు ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి బడ్జెట్‌లో నిధులు కేటాయించేందుకు ఎటువంటి అవకాశం లేదని పేర్కొన్న ప్రభుత్వం, నీరు తీసుకుంటున్న జీవీఎంసీ నుంచి బకాయిలు వసూలుచేయాలని స్పష్టంచేసింది. అయినా మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌కు ఆరు గేట్లు ఉండగా రెండు పూర్తిగా శిథిలమయ్యాయని, వర్షాకాలంలో పైనుంచి వచ్చే వరదను విడిచిపెట్టే సమయంలో ప్రమాదం చోటుచేసుకునే అవకాశం ఉందని, అందువల్ల రూ.3.2 కోట్లు తక్షణమే విడుదల చేయాలని రెండోసారి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. జీవీఎంసీ నుంచి బకాయి వసూలు చేసుకోవాలని మరోమారు ప్రభుత్వం తేల్చిచెప్పింది. రైవాడ, మేహాద్రిగెడ్డ, గంభీరం, తాటిపూడి రిజర్వాయర్ల నిర్వహణ, గేట్ల దుస్థితిపై విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం జల వనరుల శాఖను అప్రమత్తం చేసింది. తక్షణమే జీవీఎంసీ నుంచి కొంతమేర బకాయిలు రాబట్టుకుని నిర్వహణ పనులు చేపట్టాలని సూచించింది. కాగా రైవాడ, మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ ప్రాజెక్టుల నిర్వహణ గురించి జల వనరుల శాఖ విశాఖ సర్కిల్‌ ఎస్‌ఈ కేవీఎన్‌ స్వర్ణకుమార్‌ వద్ద ప్రస్తావించగా జీవీఎంసీ నుంచి నిధులు వచ్చిన వెంటనే మరమ్మతులు చేస్తామన్నారు. బకాయిలు విడుదల చేయాలని పదేపదే కోరుతున్నామని పేర్కొన్నారు.

Updated Date - May 10 , 2025 | 12:40 AM