సర్వీస్ రంగంలో విశాఖకు ఏ+
ABN , Publish Date - Sep 16 , 2025 | 01:00 AM
విశాఖ జిల్లా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో సర్వీస్ రంగంలో 90 పాయింట్లతో ఏ+ గ్రేడ్ సాధించింది.
స్వచ్ఛాంధ్రలో ‘బి’ గ్రేడ్
అమరావతిలో ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంపై సమీక్ష
విశాఖపట్నం, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి):
విశాఖ జిల్లా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో సర్వీస్ రంగంలో 90 పాయింట్లతో ఏ+ గ్రేడ్ సాధించింది. వార్షిక లక్ష్యం రూ.67,501 కోట్లు కాగా తొలి క్వార్టర్లో రూ.18,597 కోట్లు సాధించింది. వివిధ రంగాల్లో జిల్లాలు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఎటువంటి ప్రగతి సాధించాయనే అంశాలపై సోమవారం అమరావతిలో జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సదస్సులో సీఎం సమీక్షించారు. విశాఖపట్నం జిల్లా స్వచ్ఛాంధ్రలో 63 పాయింట్లతో బి గ్రేడ్ సాధించింది. వ్యవసాయ రంగంలో 26 ప్లాయింట్లతో ‘సి’ గ్రేడ్కు పరిమితమైంది. ఏడాదికి రూ.6,791 కోట్లు లక్ష్యం ఇవ్వగా, తొలి క్వార్టర్లో కేవలం రూ.749 కోట్లు సాధించింది. పరిశ్రమల రంగంలో 63 పాయింట్లతో ‘బి’ గ్రేడ్ దక్కించుకుంది. జిల్లాకు రూ.59,535 కోట్లు లక్ష్యం ఇవ్వగా తొలి క్వార్టర్లో రూ.8,030 కోట్లతో 13.49 శాతం సాధించింది.
కాగా, విశాఖపట్నంలో పర్యాటక అభివృద్ధికి ఒకేచోట 50 ఎకరాలు సేకరించామని పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ ఈ సందర్భంగా ప్రకటించారు.