అంటబొంగు ఘాట్లో వ్యాన్ బోల్తా
ABN , Publish Date - Jun 21 , 2025 | 12:36 AM
అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని అంటబొంగు ఘాట్రోడ్డులో శుక్రవారం సాయంత్రం వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు చెందిన ఇద్దరు మృతిచెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి క్షతగాత్రులు, స్థానికులు తెలిపిన వివరాలిలా వున్నాయి.
ఇద్దరి మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు
సొంతూరు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు
సెంట్రింగ్ సామాన్లు తీసుకెళుతుండగా ఘటన
ముంచంగిపుట్టు, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని అంటబొంగు ఘాట్రోడ్డులో శుక్రవారం సాయంత్రం వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు చెందిన ఇద్దరు మృతిచెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి క్షతగాత్రులు, స్థానికులు తెలిపిన వివరాలిలా వున్నాయి.
సాలూరు పట్టణంలోని గుమ్మడాం ప్రాంతానికి చెందిన వంగపండు తిరుపతి భవన నిర్మాణ నిర్మాణాల్లో సెంట్రింగ్ కాంట్రాక్టు పనులు చేస్తుంటాడు. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ సుత్తిగూడ గ్రామం వద్ద కాంట్రాక్టర్ ఒకరు ఇటీవల వంతెన నిర్మించారు. ఇందుకు వినియోగించిన సెంట్రింగ్ సామగ్రిని సెకండ్ హ్యాండ్ కింద కాంట్రాక్టర్ విక్రయించగా, వంగపండు తిరుపతి కొనుగోలు చేశాడు. సామగ్రిని సాలూరు తీసుకెళ్లడానికి శుక్రవారం అక్కడి నుంచి వ్యాన్తోపాటు పది మంది కూలీలను తీసుకువచ్చాడు. వ్యాన్లో సామాన్లు ఎక్కించుకొని సాలూరు బయలుదేరారు. కొద్ది దూరం ప్రయాణించిన తరువాత అంటబొంగు ఘాట్రోడ్డులో అధిక లోడ్ కారణంగా వ్యాన్ ముందుకు వెళ్లలేక వెనక్కు వచ్చేసింది. డ్రైవర్ అదుపు చేయలేక వ్యాన్ నుంచి బయటకు దూకేశాడు. అనంతరం వ్యాన్ అదుపు తప్పి పక్కనే వున్న లోయలోకి దూసుకుపోయి బోల్తా పడింది. సెంట్రింగ్ సామాన్లు వ్యాన్ తొట్టి భాగంలో ఉన్న కూలీలపై పడ్డాయి. స్థానికులు వెంటనే స్పందించి సెంట్రింగ్ సామాన్లలో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీశారు. వీరిలో సింగారపు శివ(39), సింగారపు రమణ(45) అప్పటికే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన వడ్డ గణపతి, దవరసింగి కుమార్, సింగారపు రమేశ్, నారపాటి బాబూరావు, నారపాటి భాస్కరరావు, వంగపండు తిరుపతి, సింగారపు శంకరరావులను ముంచంగిపుట్టు సీహెచ్సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం పాడేరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ముంచంగిపుట్టు ఎస్ఐ జె.రామకృష్ణ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు.