రోడ్డు ప్రమాదంలో వాడ్రాపల్లి ఉప సర్పంచ్ మృతి
ABN , Publish Date - Aug 22 , 2025 | 12:41 AM
తాడే పామై కాటేసిన చందంగా.. వృత్తి పరికరం యమపాశంగా మారి ఒకరి ప్రాణాలు తీసింది. మండలంలోని వాడ్రాపల్లిలో జరిగిన ఈ సంఘటనలో పంచాయతీ ఉప సర్పంచ్ మృతిచెందారు. ఇందుకు సంబంధించి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి. పంచాయతీ ఉప సర్పంచ్ కాకి ఈశ్వరరావు (52) వాడ్రాపల్లి ఆవలో చేపలవేట, కొబ్బరికాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
కొబ్బరికాయలు వలిచే గునపాం గుచ్చుకోవడంతో తీవ్రగాయాలు
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
మునగపాక, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): తాడే పామై కాటేసిన చందంగా.. వృత్తి పరికరం యమపాశంగా మారి ఒకరి ప్రాణాలు తీసింది. మండలంలోని వాడ్రాపల్లిలో జరిగిన ఈ సంఘటనలో పంచాయతీ ఉప సర్పంచ్ మృతిచెందారు. ఇందుకు సంబంధించి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి. పంచాయతీ ఉప సర్పంచ్ కాకి ఈశ్వరరావు (52) వాడ్రాపల్లి ఆవలో చేపలవేట, కొబ్బరికాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రోజూ మాదిరిగానే గురువారం ఉదయం ఏడు గంటలకు ఇంటి నుంచి వాడ్రాపల్లి ఆవకు, కొంతసేపటి తరువాత కొబ్బరితోటకు వెళ్లారు. ఇక్కడ పని పూర్తయిన తరువాత ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి బయలుదేరారు. దారిలో వాహనం అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ క్రమంలో తన వెంట తీసుకువస్తున్న కొబ్బరికాయలు వలిచే గునపాం అతని కుడికాలు, పొట్టభాగంలో బలంగా గుచ్చుకుంది. తీవ్ర గాయాలైన ఈశ్వరరావును అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ పి.ప్రసాదరావు తెలిపారు.