Share News

రుషికొండ బీచ్‌పై వీడని నిర్లక్ష్యం

ABN , Publish Date - Apr 24 , 2025 | 01:27 AM

రాష్ట్రంలో బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపు కలిగిన రుషికొండ బీచ్‌పై నిర్లక్ష్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల పలువురి ఫిర్యాదుపై నెదర్లాండ్‌ బృందం తాత్కాలికంగా బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపును ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. దీనిని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడంతో జిల్లా అధికారులంతా కలిసి పదిహేను రోజులు పనిచేసి అన్ని సరిచేశారు. నెదర్లాండ్‌ బృందం వచ్బి బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపు పునరుద్ధరించి వెళ్లిపోయింది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌, ఏపీటీడీసీ ఎండీ అమ్రపాలి, తదితరులు వచ్చి జెండా ఎగురవేశారు.

రుషికొండ బీచ్‌పై వీడని నిర్లక్ష్యం
రుషికొండ బీచ్‌లో పేరుకు పోయిన వ్యర్థాలు

తీరం పొడవునా వ్యర్థాలే

ఇదేనా నిర్వహణ తీరు?

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపు కలిగిన రుషికొండ బీచ్‌పై నిర్లక్ష్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల పలువురి ఫిర్యాదుపై నెదర్లాండ్‌ బృందం తాత్కాలికంగా బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపును ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. దీనిని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడంతో జిల్లా అధికారులంతా కలిసి పదిహేను రోజులు పనిచేసి అన్ని సరిచేశారు. నెదర్లాండ్‌ బృందం వచ్బి బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపు పునరుద్ధరించి వెళ్లిపోయింది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌, ఏపీటీడీసీ ఎండీ అమ్రపాలి, తదితరులు వచ్చి జెండా ఎగురవేశారు. పర్యాటకులు పెరిగేలా పరిశుభ్రత కొనసాగేలా చర్యలు తీసుకున్నామని, ఇక ఏమీ కాదని ప్రకటించారు. ఇటీవలె ఏపీటీడీసీ కూడా ఈ బీచ్‌ నిర్వహణ బాధ్యతలు కాంట్రాక్టర్‌కు అప్పగించేందుకు ప్రకటన జారీచేసింది. ఆ టెండర్‌ ఖరారు కాలేదు. జిల్లా అధికారులే బీచ్‌ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. అయితే గత కొద్దిరోజులుగా బీచ్‌ను శుభ్రం చేయడం లేదు. ఎక్కడెక్కడి నుంచో చెత్త అంతా కొట్టుకువచ్చి పేరుకుపోతోంది. దానిని ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయాల్సి ఉంది. కానీ చూసీచూడనట్టు పోతున్నారు. ఇక్కడ పర్యాటకులు స్నానాలు చేసేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత బీచ్‌ నిర్వాహకులపై ఉంది. కానీ ఇక్కడ చెత్త చూసి ఎవరూ స్నానానికి దిగడం లేదు. అలాగే సందర్శకులు కొందరు ఇటీవల స్వల్పగాయాలకు గురైతే ప్రథమ చికిత్స కోసం అక్కడ విచారించారు. ఎటువంటి ముందులు అందుబాటులో లేకపోవడంతో గీతం మెడికల్‌ కాలేజీకి వెళ్లి చికిత్స తీసుకున్నారు. బ్లూ ఫ్లాగ్‌ పునరుద్ధరణ తరువాత జిల్లా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ రెండుసార్లు బీచ్‌కు వెళ్లి ఆకస్మిక తనిఖీలు చేసి, పలు సూచనలు చేశారు. అయితే ఎందుకనో అక్కడి సిబ్బంది అధికారులకు సహకరించడం లేదనే అనుమానాలు ఉన్నాయి. జిల్లా కలెక్టర్‌ మరోసారి అన్ని శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, ఎవరు ఏ బాధ్యతలు నిర్వహిస్తున్నారో తెలుసుకొని తగిన సూచనలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీచ్‌ బాధ్యతలు వేరొకరికి అప్పగించకుండా స్వయంగా కలెక్టరే తరచూ రుషికొండ బీచ్‌ను సందర్శించాల్సి ఉంది.

Updated Date - Apr 24 , 2025 | 01:27 AM