భీమిలి బీచ్ రోడ్డులో యూనిటీ మాల్
ABN , Publish Date - May 02 , 2025 | 01:04 AM
విశాఖపట్నం-భీమిలి బీచ్రోడ్డులో తిమ్మాపురం వద్ద రామానాయుడు స్టూడియో ఉన్న కొండ దిగువన రూ.172 కోట్లతో యూనిటీ మాల్ (వాణిజ్య సముదాయం) నిర్మించనున్నారు.
రూ.172 కోట్లతో నిర్మాణం
హస్త కళాకారులు, చేనేత వృత్తిదారులకు ప్రోత్సాహం అందించడమే లక్ష్యం
62 షాపులు నిర్మాణం
వాటితో పాటు రెస్టారెంట్లు, కన్వెన్షన్ సెంటర్, ఫిట్నెస్ సెంటర్, బ్యాంకు శాఖలు, ఫర్నీచర్ స్టోర్లు ఏర్పాటు
అమరావతి నుంచి నేడు వర్చువల్గా శంకుస్థాపన చేయనున్న ప్రధాని
విశాఖపట్నం, మే 1 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం-భీమిలి బీచ్రోడ్డులో తిమ్మాపురం వద్ద రామానాయుడు స్టూడియో ఉన్న కొండ దిగువన రూ.172 కోట్లతో యూనిటీ మాల్ (వాణిజ్య సముదాయం) నిర్మించనున్నారు. ఈ మాల్ నిర్మాణానికి శుక్రవారం అమరావతి నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. హస్తకళలు, చేనేత వృత్తులను ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం మాల్స్ ఏర్పాటుచేస్తోంది. అందులో రాష్ర్టానికి కేటాయించిన మాల్ తిమ్మాపురం వద్ద నిర్మితం కానున్నది.
యూనిటీ మాల్కు విశాఖ రూరల్ మండలం మధురవాడ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 462/2లో ఐదు ఎకరాలు కేటాయించారు. బీచ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న ఈ స్థలంలో 3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ+4 భవనం నిర్మించే బాధ్యత ఏపీఐఐసీకి అప్పగించారు. భవన నిర్మాణానికి రూ.110 కోట్లు కేటాయించారు. మాల్ నిర్మాణం పూర్తయిన తరువాత షాపుల ఇంటీరియర్ డెకరేషన్, ఇతర నిర్వహణ, వసతులకు రూ.62 కోట్లు ఖర్చు చేస్తారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ.86 కోట్లు విడుదల చేసింది. మాల్ నిర్మాణం పూర్తయిన తరువాత నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యత చేనేత జౌళి శాఖకు అప్పగించనున్నారు. నిర్మాణానికి టెండర్లు పిలవగా ఉమ్మడి ఏపీలో కీలక ప్రాజెక్టులు చేపట్టిన కేపీసీకి బిడ్ దక్కింది. వచ్చే ఏడాది మార్చికల్లా పనులు పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రధాన మంత్రి శుక్రవారం శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో నాలుగు రోజుల నుంచే స్థలం చదునుచేసే పనులకు శ్రీకారం చుట్టారు. పొదలు తొలగింపు, బీచ్ రోడ్డు నుంచి అప్రోచ్ రహదారి నిర్మాణం పనులు చేస్తున్నారు. ఏపీఐఐసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ బడగల హరిధరరావు గురువారం పనులను పర్యవేక్షిస్తూ కాంట్రాక్టర్కు పలు సూచనలు చేశారు.
62 షాపులు, ఆడిటోరియం
మాల్లో మొదటి రెండు అంతస్థులలో 62 షాపులు నిర్మించనున్నారు. ఏపీకి చెందిన వారికి 26, మిగిలిన రాష్ట్రాలకు చెందిన వారికి 36 షాపులు కేటాయిస్తారు. మూడో అంతస్థు నుంచి సముద్రం చూసేలా వ్యూపాయింట్ ఏర్పాటుచేస్తారు. ఇంకా మరికొన్ని సదుపాయాలు వస్తాయి. నాలుగో అంతస్థులో కన్వెన్షన్ హాలు, రెండు మినీ థియేటర్లు, రిటైల్ స్టోర్లు, రెస్టారెంట్లు, రిక్రియేషన్ జోన్, ఫిట్నెస్ సెంటర్, బ్యాంకు శాఖలు, ఫర్నీచర్ స్టోర్లు ఉంటాయి. వన్ డిస్ట్రిక్టు వన్ ప్రొడక్టు, దేశంలో తయారుచేసే చేతివృత్తులు ఈ మాల్లో విక్రయిస్తారు. ఉదాహరణకు ఏటికొప్పాక బొమ్మలు, ప్రసిద్ధి చెందిన చేనేత వస్త్రాలు, ఈశాన్య భారతంలో చేతివృత్తి ఉత్పత్తులు వంటివి ఇక్కడ అమ్మనున్నారు. దేశీయంగా భౌగోళిక గుర్తింపు పొందిన ఉత్పత్తులకు ప్రోత్సాహం, పర్యాటం అభివృద్ధి పీఎం ఏక్తామాల్ ఏర్పాటు ముఖ్య ఉద్దేశమని చేనేత, జౌళి శాఖ అఽధికారులు పేర్కొన్నారు.