నగరంలో తృప్తి క్యాంటీన్లు
ABN , Publish Date - May 31 , 2025 | 01:02 AM
నగరంలో ‘తృప్తి’ క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. జీవీఎంసీ పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక పురోభివృద్ధి, మహిళలకు జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో జీవీఎంసీ యూసీడీ ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
స్వయం సహాయక సంఘాల ఆర్థిక పురోభివృద్ధికి జీవీఎంసీ నిర్ణయం
జూన్ 6న జరగనున్న కౌన్సిల్ సమావేశానికి 27 అంశాలతో అజెండా
మరికొన్ని అంశాలను చేర్చాలని పలువురు కార్పొరేటర్ల పట్టు
విశాఖపట్నం, మే 30 (ఆంధ్రజ్యోతి):
నగరంలో ‘తృప్తి’ క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. జీవీఎంసీ పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక పురోభివృద్ధి, మహిళలకు జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో జీవీఎంసీ యూసీడీ ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ‘వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్ప్రెన్యూర్’ కింద సారా ప్రాజెక్టు, జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం గుర్తించిన ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతానికి మూడుచోట్ల వీటిని ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించడంతో పైలట్ ప్రాజెక్టుగా వీటిని ప్రారంభించే అవకాశం ఉంది. దీనిపై జూన్ 6న జరగనున్న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపేందుకు వీలుగా అజెండాలో చేర్చారు. కౌన్సిల్ సమావేశానికి అధికారులు 27 అంశాలతో కూడిన అజెండాను సిద్ధం చేశారు. అయితే ఇందులో మరికొన్ని అంశాలను చేర్చాలంటూ పలువురు కార్పొరేటర్లు మేయర్ పీలా శ్రీనివాసరావు, గ్రేటర్ కార్యదర్శి బీవీ రమణను కలిసి పట్టుబడుతున్నారు.
జీవీఎంసీ కౌన్సిల్ సాధారణ సమావేశం గత ఏడాది డిసెంబరులో జరిగింది. ఆ తరువాత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం, కొత్త మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక కారణంగా ఇప్పటివరకు కౌన్సిల్ సమావేశం జరగలేదు. మేయర్గా పీలా శ్రీనివాసరావు ఎన్నికైన తరువాత ఇదే తొలి కౌన్సిల్ సమావేశం కావడం ప్రత్యేకతను సంతరించుకుంది. జూన్ 6న జరిగే కౌన్సిల్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు వీలుగా అధికారులు, కార్పొరేటర్లు అనేక పనులకు సంబంధించిన అంశాలను అజెండాలో చేర్చాలంటూ మేయర్ పీలా, ఇన్చార్జి కమిషనర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్కు వినతిపత్రాలను అందజేశారు. దీంతో అజెండాలో వందకుపైగా అంశాలు ఉండవచ్చని అందరూ భావించారు. కానీ అజెండా కూర్పుపై మేయర్, జీవీఎంసీ కార్యదర్శి, కొందరు అధికారులు కార్పొరేటర్లతో చర్చించారు. అనంతరం 27 అంశాలను మాత్రమే అజెండాలో చేర్చాలని నిర్ణయించారు. ఇందులో ప్రధానంగా మలేరియా సీజనల్ కార్మికుల నియామకం, పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న తాత్కాలిక కార్మికుల సేవల పొడిగింపు, 76వ వార్డులో రూ.1.96 కోట్లతో డ్రెయిన్ నిర్మాణం, 97వ వార్డులో రూ.1.85 కోట్లతో థీమ్ పార్కుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, 87వ వార్డు పరిధి కూర్మన్నపాలెం ఎంవీవీ-ఎంకే అపార్టుమెంట్కు 150 కేఎల్డీ శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయడానికి రూ.1.21 కోట్లతో పైపు లైన్ నిర్మాణం, 18వ వార్డు పరిధి అప్పూఘర్లో రూ.66.50 లక్షలతో కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్థు నిర్మాణం వంటి అంశాలు ఉన్నాయి.
కాగా జనసేన పార్టీకి చెందిన 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ తాను కౌన్సిల్లో చర్చించేందుకు వీలుగా పది అంశాలను అజెండాలో చేర్చాలని కోరితే, వాటిని చేర్చకపోవడంతో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోళ్ల వ్యర్థాల టెండర్లు, రాత్రి ఫుడ్ కోర్టు, టీడీఆర్ కుంభకోణం, పార్కులు, జీవీఎంసీ ఆస్తులు, జీ-20 పనులు వంటి అంశాలపై చర్చించాలని కోరుతూ మేయర్, గ్రేటర్ కార్యదర్శితోపాటు ఇన్చార్జి కమిషనర్కు వినతిపత్రం అందజేస్తే, కనీసం వాటిని పట్టించుకోక పోవడానికి కారణమేమిటని కార్యదర్శిని ఆయన నిలదీశారు. తాను ఇచ్చిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోకపోతే అందుకు గల కారణాలను లిఖితపూర్వకంగా తెలపాలని డిమాండ్ చేయడంతో అధికారులు సందిగ్ధంలో పడ్డారు. అలాగే 5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత, 87వ వార్డు బొండా జగన్ కూడా తమ వార్డులకు సంబంధించిన పలు అంశాలను అజెండాలో చేర్చాలని పట్టుబడుతున్నారు. దీంతో శుక్రవారమే అజెండా కాపీలను కార్పొరేటర్లకు పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ సాయంత్రానికి కూడా వారికి చేరకపోవడంతో చర్చకు దారితీసినట్టయింది. ఆయా అంశాలను అనుబంధ అజెండాలో చేర్చుతారా? లేకపోతే 27 అంశాలతోనే అజెండాను ఖరారు చేస్తారా? అనేదానిపై అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు.