మావోయిస్టులకు వ్యతిరేకంగా గిరిజనులు నినాదాలు
ABN , Publish Date - Jun 25 , 2025 | 10:49 PM
జీకేవీధి మండలం దుప్పులవాడలో బుధవారం పలు గ్రామాలకు చెందిన గిరిజనులు మావోయిస్టుల చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
దుప్పలవాడలో మావోయిస్టుల చేతిలో ప్రాణాలు
కోల్పోయిన గిరిజనుల పేరిట స్థూపం నిర్మాణం
మావోలు జనజీవన స్రవంతిలో కలవాలని నినాదాలు
సీలేరు, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): జీకేవీధి మండలం దుప్పులవాడలో బుధవారం పలు గ్రామాలకు చెందిన గిరిజనులు మావోయిస్టుల చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దుప్పులవాడ గ్రామంలో మావోయిస్టుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన గిరిజనుల జ్ఞాపకార్థం స్మారక స్థూపాన్ని నిర్మించారు. అక్కడే గిరిజనులంతా బుధవారం సమావేశమై మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ మావోయిస్టులు అనేకమంది గిరిజనుల ప్రాణాలు తీశారని, వారి జ్ఞాపకార్థం ఈ స్థూపాన్ని నిర్మించుకున్నామన్నారు. మావోయిస్టుల వల్ల గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడిందని, ఇకనైనా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో కొమ్ములవాడ, బంధవీధి, గొర్రిలోవ, దుప్పులవాడ, రుష్యాగూడ, కొత్తపాకలు, చల్లనిశిల్ప గ్రామాల గిరిజనులు పాల్గొన్నారు.