గిరి మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
ABN , Publish Date - Oct 17 , 2025 | 11:00 PM
అవకాశాలను అందిపుచ్చుకుని గిరిజన మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వి.మురళి అన్నారు.
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ మురళి
ఆహార ఉత్పత్తుల ప్రోసెసింగ్పై మహిళలకు ఒక్కరోజు శిక్షణ
పాడేరు, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి):అవకాశాలను అందిపుచ్చుకుని గిరిజన మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వి.మురళి అన్నారు. సెర్ఫ్, డీఆర్డీఏ, ఏపీఎఫ్పీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక జిల్లా మహిళా సమాఖ్య భవనంలో నిర్వహించిన మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల శిక్షణలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. జిల్లాలో ఆహార ఉత్పత్తుల ప్రోసెసింగ్, దాని అనుబంధ ఉత్పత్తుల యూనిట్ల ఏర్పాటుకు ఎంపిక చేసిన మహిళలంతా ప్రత్యేక శ్రద్ధతో ఆయా యూనిట్లను నిర్వహించాలన్నారు. చిన్నగా మొదలైన ఆహార ఉత్పత్తుల ప్రక్రియ రానున్న రోజుల్లో భారీ స్థాయికి చేరుతుందని, ఆయా మహిళలంతా పారిశ్రామికవేత్తలు కావాలని డీఆర్డీఏ పీడీ ఆకాంక్షించారు. ప్రస్తుతం పేదలుగా ఉన్న మహిళలను లక్షాధికారులను చేయాలనే లక్ష్యంతోనే ఆహార ఉత్పత్తుల యూనిట్లు మంజూరు, శిక్షణ కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. వ్యవసాయ, ఉద్యానవన పంటల ద్వారా ప్రజల జీవనోపాదులను మెరుగుపర్చేందుకు అవసరమైన చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఫుడ్ ప్రోసెసింగ్ కార్పొరేషన్ జోనల్ మేనేజర్ జనార్దన్, వెలుగు డీపీఎంలు భగవాన్దాస్, ప్రభాకర్, ఉద్యావన, వ్యవసాయశాఖల అధికారులు, జిల్లాలోని ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.