రోడ్డు ప్రమాదంలో గిరిజనుడి మృతి
ABN , Publish Date - Jul 29 , 2025 | 12:46 AM
మండలంలోని కృష్ణాపురం గ్రామ సమీపంలో ఆగి వున్న ట్రాక్టర్ను ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఓ గిరిజనుడు మృతి చెందగా, మరో వ్యక్తి గాయపడ్డాడు.
మరొకరికి గాయాలు
చింతపల్లి, జూలై 28 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కృష్ణాపురం గ్రామ సమీపంలో ఆగి వున్న ట్రాక్టర్ను ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఓ గిరిజనుడు మృతి చెందగా, మరో వ్యక్తి గాయపడ్డాడు. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. ఆదివారం రాత్రి కృష్ణాపురం గ్రామానికి చెందిన కేపారి ఆముడు(26), కొయ్యూరు మండలం మర్రివాడ పంచాయతీ పిడితమామిడి గ్రామానికి చెందిన సుర్ల గంగరాజు ద్విచక్రవాహనంపై లోతుగెడ్డ జంక్షన్కు ప్రయాణమయ్యారు. కేపారి ఆముడు ద్విచక్రవాహనాన్ని నడుపుతున్నారు. వర్షం పడుతుండడంతో ఒక చేయిని కళ్లపై నీళ్లు పడకుండా అడ్డంగా పెట్టుకుని మరో చేత్తో వాహనం నడుపుతున్నాడు. అయితే లోతుగెడ్డ జంక్షన్-కృష్ణాపురం మార్గమధ్యంలో ట్రాక్టర్ నిలిపి ఉండడాన్ని గమనించలేదు. దానిని బలంగా ఢీకొనడంతో ఆముడు తీవ్రంగా గాయపడ్డారు. వెనుక కూర్చుకున్న గంగరాజు స్వల్పంగా గాయపడ్డారు. ఆముడును 108లో చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడికి భార్య ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని స్థానిక ఎస్ఐ వెంకటరమణ తెలిపారు.