పారదర్శకంగా టెన్త్ మూల్యాంకనం
ABN , Publish Date - Apr 06 , 2025 | 11:13 PM
పదవ తరగతి పరీక్షల మూల్యాంకనం పారదర్శకంగా నిర్వహించాలని విద్యాశాఖాధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్కుమార్ ఆదేశించారు.
కలెక్టర్ ఏఎస్ దినేశ్కుమార్
తలారిసింగి ఆశ్రమ పాఠశాలలో సౌకర్యాలపై ఆరా
సజావుగా ప్రక్రియ నిర్వహించాలని విద్యాశాఖాధికారులను సూచన
పాడేరు, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): పదవ తరగతి పరీక్షల మూల్యాంకనం పారదర్శకంగా నిర్వహించాలని విద్యాశాఖాధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్కుమార్ ఆదేశించారు. స్థానిక తలారిసింగి ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న టెన్త్ మూల్యాంకన ప్రక్రియపై సరైన పర్యవేక్షణ లేదని, సదుపాయాల లేమితో టీచర్లు ఇబ్బందులు పడుతున్నారనే సమాచారం మేరకు ఆదివారం ఆయన అక్కడకు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టెన్త్ పరీక్షలను ఎంత సజావుగా, పారదర్శకంగా నిర్వహించామో, అంత కంటే పారదర్శకంగా మూల్యాంకనం చేయాలన్నారు. ఎవరికీ ఎటువంటి అనుమానాలు తలెత్తకూడదని, ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ప్రక్రియ జరగాలన్నారు. అలాగే నిరంతరం విద్యుత్ సదుపాయం కల్పించాలని, టీచర్లకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈవో పి.బ్రహ్మాజీరావు, విద్యాశాఖ సహాయ కమిషనర్(పరీక్షలు) శశిభూషణ్కుమార్, తదితరులు పాల్గొన్నారు.