పొర్లుపాలెం రోడ్డులో ట్రాఫిక్పై సర్వే
ABN , Publish Date - Jul 10 , 2025 | 01:06 AM
జోన్-8 పరిధి బీఆర్టీఎస్ రోడ్డు నాయుడుతోట జంక్షన్ నుంచి పొర్లుపాలెం వరకూ ఆంధ్రా సిమెంట్ ఫ్యాక్టరీ రోడ్డులో ట్రాఫిక్పై సర్వే చేయాల్సిందిగా పోలీసులను కోరాలని జీవీఎంసీ టౌన్ప్లానింగ్ అధికారులు నిర్ణయించారు.
పోలీస్ విభాగాన్ని కోరాలని నిర్ణయించిన టౌన్ప్లానింగ్ అధికారులు
‘ఆంధ్రజ్యోతి’ కథనంతో జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, రెవెన్యూ శాఖల్లో కలకలం
రోడ్డు విస్తరణను నిలిపివేసేందుకు నిర్ణయం?
అందుకు అనుగుణంగా చర్యలు
విశాఖపట్నం, జూలై 9 (ఆంధ్రజ్యోతి):
జోన్-8 పరిధి బీఆర్టీఎస్ రోడ్డు నాయుడుతోట జంక్షన్ నుంచి పొర్లుపాలెం వరకూ ఆంధ్రా సిమెంట్ ఫ్యాక్టరీ రోడ్డులో ట్రాఫిక్పై సర్వే చేయాల్సిందిగా పోలీసులను కోరాలని జీవీఎంసీ టౌన్ప్లానింగ్ అధికారులు నిర్ణయించారు. నాయుడుతోట-పొర్లుపాలెం రోడ్డు ప్రస్తుతం సుమారు 40 అడుగులు వెడల్పున ఉండగా, దీనిని వంద అడుగులకు విస్తరించేందుకు అధికారులు నిర్ణయించడం, రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్ (ఆర్డీపీ) చేయడంపై ‘కూటమి నేత మాస్టర్ ప్లాన్’ శీర్షికన బుధవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనం జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, రెవెన్యూ శాఖల్లో చర్చనీయాంశంగా మారింది. అవసరం లేకపోయినప్పటికీ అస్మదీయులైన వారికి టీడీఆర్లను ఇచ్చేందుకు రోడ్డు విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో టౌన్ప్లానింగ్ అధికారులు దిద్దుబాటు చర్యలపై దృష్టిసారించారు. వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్లో పొందుపరిచిన 20 రహదారుల్లో అత్యవసరంగా విస్తరించాల్సిన వాటిని పక్కనపెట్టి గంటకు పది వాహనాలు మించి తిరగని రోడ్డును ఆగమేఘాల మీద విస్తరించాల్సిన అవసరం ఏమొచ్చింది?, రైల్వే ట్రాక్ కారణంగా రోడ్డు డెడ్ ఎండ్ అవుతున్నందున భవిష్యత్తులో అటువైపు నివాసాలుగానీ, పరిశ్రమలుగానీ వచ్చే అవకాశం లేదని తెలిసి కూడా ఎందుకు విస్తరించాలని నిర్ణయించారు?...వంటి ప్రశ్నలకు టౌన్ప్లానింగ్ అధికారుల వద్ద సమాధానం లేదు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఆ రోడ్డును విస్తరణ జాబితాలో చేర్చాల్సి వచ్చిందని చెబుతున్న టౌన్ప్లానింగ్ అధికారులు ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పడానికి సాహసించలేకపోతున్నారు. అయితే రోడ్డు విస్తరణకు ఆర్డీపీ ఇప్పటికే పూర్తయినా ఇంకా ఆమోదం పొందలేదని, నంబర్ కూడా జారీకాలేదు కాబట్టి, ప్రతిపాదనను ఇప్పుడు నిలిపివేసేందుకు అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ వ్యవహారంలో తమ తప్పులేకుండా రోడ్డు విస్తరణను నిలిపేసేందుకు వీలుగా ఆ రోడ్డుపై వాహనాల రద్దీ ఏ స్థాయిలో ఉంది?, గంటకు ఎన్నివాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి?, భవిష్యత్తులో ట్రాఫిక్ ఏ స్థాయిలో పెరిగే అవకాశం ఉందనే విషయాలను తెలుసుకునేందుకు ట్రాఫిక్ మేనేజ్మెంట్ సర్వే చేయాలంటూ ట్రాఫిక్ పోలీసులను కోరాలని టౌన్ప్లానింగ్ అధికారులు నిర్ణయించారు. రెండు, మూడు రోజుల్లో ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్కు లేఖ రాయనున్నట్టు జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు.
నేడు మెగా పేరెంట్, టీచర్ మీటింగ్
జిల్లాలోని 1388 పాఠశాలల్లో నిర్వహణ
విద్యార్థుల తల్లిదండ్రులకు టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్స్ పోటీలు
విశాఖపట్నం, జూలై 9 (ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వం వినూత్నంగా రూపొందించిన మెగా పేరెంట్-టీచర్ సమావేశాలు గురువారం జిల్లాలోని 1,388 పాఠశాలల్లో నిర్వహించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. జిల్లాలో 595 ప్రభుత్వ, 793 ప్రైవేటు యాజమాన్య పాఠశాలల్లో సమావేశాలు నిర్వహించాలని ప్రదానోపాధ్యాయులకు ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 70,031 మంది, ప్రైవేటు పాఠశాలల్లో 3,33,164 మంది...మొత్తం 4,03,195 మంది విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలకు హాజరుకానున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కానున్న కార్యక్రమాలు మధ్యాహ్నం ఒంటి గంట వరకూ కొనసాగుతాయి. తొలుత తరగతి గదిలో విద్యార్థులు, తల్లిదండ్రులతో టీచర్ సమావేశం అవుతారు. ఆ తరువాత మొత్తం విద్యార్థులతో సమావేశం నిర్వహిస్తారు. ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు, ముఖ్య అతిథిగా వచ్చే అధికారుల ప్రసంగాలు ఉంటాయి. పాఠశాలల అభివృద్ధికి సాయపడే దాతలకు సత్కరిస్తారు. అనంతరం తల్లిదండ్రులకు టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్స్ పోటీలు నిర్వహించి బహమతులు అందజేస్తారు. అందరికీ మధ్యాహ్న భోజనం ఏర్పాటుచేస్తున్నారు. కాగా మెగా పేరెంట్, టీచర్ సమావేశాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని డీఈవో ఎన్.ప్రేమ్కుమార్ తెలిపారు. సమావేశాల నిర్వహణకు ఎంఈవోల ఆధ్వర్యంలో పలువురితో కమిటీలు వేశామని, అధికారుల తమ పరిధిలో పాఠశాలలు తనిఖీ చేస్తారన్నారు. తల్లిదండ్రులు విధిగా పాఠశాలలకు వచ్చి సమావేశాలు విజయంంతం చేయాలని పిలుపునిచ్చారు.