ట్రాఫిక్ సిగ్నల్స్ సింక్రనైజేషన్
ABN , Publish Date - Jun 13 , 2025 | 01:26 AM
నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ సింక్రనైజేషన్ (సమకాలీనం)పై పోలీసులు దృష్టిసారించారు.
హోం మంత్రి సూచనపై సీపీ కసరత్తు
గ్రీన్ సిగ్నల్తో ఒక కూడలి దాటిన వాహనం తదుపరి కూడలికి వెళ్లేసరికి గ్రీన్ ఉండేలా సమకాలీన వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు
ట్రాఫిక్ కూడళ్ల వద్ద కష్టాలు తగ్గుముఖం పడతాయని ఆశాభావం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ సింక్రనైజేషన్ (సమకాలీనం)పై పోలీసులు దృష్టిసారించారు. ఒక కూడలిలో గ్రీన్సిగ్నల్ దాటిన వాహనం తర్వాత కూడలి వద్దకు వెళ్లేసరికి గ్రీన్సిగ్నల్ ఉండేలా సమకాలీన సిగ్నల్ వ్యవస్థను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. హోం మంత్రి వంగలపూడి అనిత ఇటీవల పోలీస్ కమిషనరేట్లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైనప్పుడు ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు సిగ్నల్స్ను సింక్రనైజేషన్ చేయడంపై ఆలోచన చేయాలని సీపీ శంఖబ్రతబాగ్చికి సూచించారు. ఈ మేరకు సిగ్నల్స్ సింక్రనైజేషన్ సాధ్యాసాధ్యాలపై నిపుణులతో సంప్రతింపులు ప్రారంభించారు.
నగరంలో రోజురోజుకీ ట్రాఫిక్ సమస్య జఠిలంగా తయారవుతోంది. వాహనాలు పెరగడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది. ప్రధాన మార్గాల్లో ఒకచోట సిగ్నల్ పడితే వాహనాలు కిలోమీటర్లు బారులు తీరిపోతున్నాయి. ఒక్కోసారి కూడలి దాటేందుకు రెండుసార్లు సిగ్నల్స్ పడేంత వరకూ వేచిచూడాల్సిన పరిస్థితి ఉంటోంది. అంతసేపు వేచి ఉండలేక కొందరు సిగ్నల్ జంపింగ్లకు పాల్పడడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ను సింక్రనైజేషన్ చేయాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. అధికారులు దీనిపై పలుమార్లు ప్రకటనలు చేసినప్పటికీ ఆచరణలోకి రాలేదు. ఇటీవల రాష్ట్ర హోంశాఖమంత్రి వంగలపూడి అనిత నగర పోలీసులు రూపొందించిన ‘అస్త్రం’ యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రాఫిక్ కష్టాల నుంచి వాహన చోదకులు తప్పించుకునేందుకు ఈ ‘అస్త్రం’ మొబైల్ యాప్ దోహదపడుతుందని సీపీ శంఖబ్రతబాగ్చి హోంమంత్రికి వివరించారు. అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారిందన్నారు. ఒకచోట రెడ్ సిగ్నల్కు దొరికితే తర్వాత అన్ని కూడళ్ల వద్ద కూడా రెడ్సిగ్నల్ పడి ఉండడంతో ఆగాల్సిన పరిస్థితి ఉంటోందన్నారు. దీనివల్ల వాహన చోదకులు చాలా సమయం ప్రయాణం కోసమే కేటాయించాల్సిన పరిస్థితి తలెత్తుతోందన్నారు. దీనిని అధిగమించేందుకు నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ను సింక్రనైజ్ చేయాలని, అలా చేయడం వల్ల ఒకచోట గ్రీన్సిగ్నల్ పడితే తర్వాత కూడలికి వెళ్లేసరికి కూడా గ్రీన్సిగ్నల్ ఉంటుంది కాబట్టి, వాహన చోదకులకు సమయం ఆదా కావడంతోపాటు ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుందన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ సింక్రనైజేషన్ చేసేలా చర్యలు తీసుకోవాలని సీపీకి సూచించారు. రాష్ట్ర హోం మంత్రి స్వయంగా ఆదేశించడంతో ట్రాఫిక్ సిగ్నల్స్ సింక్రనైజేషన్పై సీపీ దృష్టిసారించారు. నగరంలో అన్ని కూడళ్ల వద్ద వాహనాల రద్దీని అధ్యయనం చేసి, ట్రాఫిక్ సింక్రనైజేషన్ సిస్టమ్ అమలు సాధ్యాసాధ్యాలపై ఒక ప్రైవేటు సంస్థకు చెందిన నిపుణులతో సీపీ చర్చించినట్టు తెలిసిందే. వారు ఇచ్చే నివేదిక ఆధారంగా ట్రాఫిక్ సిగ్నల్స్ సింక్రనైజేషన్ చేయడానికి అవకాశం ఉన్నట్టయితే సీఎస్ఆర్ నిధులతో ప్రాజెక్టును పూర్తిచేసే అవకాశం ఉందని పోలీస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.