హైవేపై ట్రాఫిక్ జామ్
ABN , Publish Date - Jun 19 , 2025 | 01:17 AM
నగరంలోని జాతీయ రహదారిపై బుధవారం ట్రాఫిక్ జామ్ అయ్యింది. బీచ్ రోడ్డులో ఈ నెల 21న ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నందున ఎటువంటి వాహనాలు రాకుండా పోలీసులు కట్టడి చేశారు. ఎక్కడికక్కడ మార్గాలు మూసేశారు.
కొమ్మాది జంక్షన్ నుంచి మద్దిలపాలెం రావడానికి గంటన్నర సమయం
ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ అదే పరిస్థితి
బీచ్ రోడ్డులో రాకపోకల నిలిపివేత ఫలితం
ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు ఎక్కడ?
డ్రోన్లు ఉపయోగించాలని మంత్రి అనిత ఆదేశం
ఇప్పుడే ఇలా ఉంటే శుక్ర, శనివారాల్లో పరిస్థితి ఏమిటో..?
నగర ప్రజల ఆందోళన
విశాఖపట్నం, జూన్ 18 (ఆంధ్రజ్యోతి):
నగరంలోని జాతీయ రహదారిపై బుధవారం ట్రాఫిక్ జామ్ అయ్యింది. బీచ్ రోడ్డులో ఈ నెల 21న ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నందున ఎటువంటి వాహనాలు రాకుండా పోలీసులు కట్టడి చేశారు. ఎక్కడికక్కడ మార్గాలు మూసేశారు. దాంతో బీచ్రోడ్డులో వెళ్లాల్సిన వాహనాలన్నీ జాతీయ రహదారిపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు మొదలయ్యాయి. బుధవారం అటు కొమ్మాది నుంచి మద్దిలపాలెం రావడానికి వాహన చోదకులకు రెండు గంటల సమయం పట్టింది. ముఖ్యంగా విశాఖ వేలీ స్కూల్ జంక్షన్ నుంచి మద్దిలపాలెం రావడానికి గంటన్నర పట్టింది. ఉదయం 10 గంటలకు మొదలైన ఈ సమస్య రాత్రి 10 గంటల వరకూ కొనసాగింది. ట్రాఫిక్లో ఇరుక్కుపోయినవారు చాలా ఇబ్బందిపడ్డారు. పోలీసులంతా బీచ్రోడ్డుకే పరిమితం కావడం, ట్రాఫిక్ క్లియర్ చేయడానికి అదనపు సిబ్బందిని నియమించకపోవడం వల్ల సమస్యకు కారణంగా చెప్పవచ్చు. ఇప్పుడే ఇలా ఉంటే...శుక్ర, శనివారాల్లో ట్రాఫిక్ పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.
డ్రోన్లు ఉపయోగించండి : హోం మంత్రి అనిత ఆదేశం
జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయిన విషయం హోం మంత్రి అనిత దృష్టికి వెళ్లడంతో ఆమె కమాండ్ కంట్రోల్ రూమ్ను సందర్శించి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ను సీసీ టీవీ కెమెరాల ద్వారా పరిశీలిస్తూ వాటిని క్లియర్ చేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో డ్రోన్లను ఎగురవేసి ఎక్కడ సమస్య ఉందో తెలుసుకొని క్లియర్ చేయాలని సూచించారు.