అరకులోయకు పోటెత్తిన పర్యాటకులు
ABN , Publish Date - Oct 04 , 2025 | 11:38 PM
అరకులోయకు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. సందర్శిత ప్రాంతాలన్నీ కిటకిటలాడాయి.
కిటకిటలాడిన సందర్శిత ప్రాంతాలు
రిసార్టులు, లాడ్జీలన్నీ ఫుల్
ఎటుచూసినా పర్యాటకుల సందడే..
చిరువ్యాపారులకు ఉపాధి
అరకులోయ, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): అరకులోయకు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. సందర్శిత ప్రాంతాలన్నీ కిటకిటలాడాయి. అరకులోయలోని టూరిజం, ప్రైవేటు రిసార్టుల్లో రూమ్లు ఆరో తేదీ వరకు ఫుల్ అయిపోయాయి. ఎటుచూసినా సందర్శకుల సందడే కనిపించింది. ముఖ్యంగా ఘాట్రోడ్లోని కాఫీ తోటలు, గాలికొండ వ్యూపాయింట్, సుంకరమెట్ట కాఫీ ట్రైయిల్ను పెద్ద ఎత్తున పర్యాటకులు సందర్శించారు. ఉడెన్ బ్రిడ్జి, ట్రీడెక్, ఫొటో ఫ్రేం, నెస్ట్ నెట్ వద్ద సందర్శకులు కుటుంబాలతో గ్రూపు ఫొటోలు దిగుతూ ఎంజాయ్ చేశారు. కాఫీ తోటల మధ్య ఉన్న ఉడెన్ బ్రిడ్జిపై పెద్ద ఎత్తున సందర్శకులు నడుస్తూ ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. అదేవిధంగా అరకులోయలో ట్రైబల్ మ్యూజియం, పద్మాపురం గార్డెన్లను సందర్శించారు. గార్డెన్లో హాట్ ఎయిర్ బెలూన్ పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బెలూన్లో ఫ్లై అవుతూ ఎంజాయ్ చేశారు. పర్యాటకుల రాకతో టాక్షీవాలాలు, ఆటోవాలాలకు ఉపాధి లభించింది. రిసార్టులు, లాడ్జీలకు, చిరువ్యాపారులకు వ్యాపారం సాగింది.