నేటి అరకు రైల్రోకో తాత్కాలిక వాయిదా
ABN , Publish Date - May 18 , 2025 | 11:07 PM
గిరిజనులకు ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని, గిరిజనులకు ఉద్యోగాల్లో శత శాతం రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్పై ఈ నెల 19న తలపెట్టిన అరకు రైల్రోకోను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు స్పెషల్ డీఎస్సీ సాధన సమితి ఆదివారం రాత్రి ప్రకటించింది.
స్పెషల్ డీఎస్సీ సాధన సమితితో సబ్కలెక్టర్ చర్చలు సఫలం
పాడేరు, మే 18(ఆంధ్రజ్యోతి): గిరిజనులకు ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని, గిరిజనులకు ఉద్యోగాల్లో శత శాతం రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్పై ఈ నెల 19న తలపెట్టిన అరకు రైల్రోకోను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు స్పెషల్ డీఎస్సీ సాధన సమితి ఆదివారం రాత్రి ప్రకటించింది. రైల్రోకో నేపథ్యంలో స్థానిక సబ్కలెక్టర్ శౌర్యమన్ పటేల్ డీఎస్సీ సాధన సమితి నేతలతో చర్చించారు. గిరిజనుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ఈ క్రమంలో రైల్రోకోను వాయిదా వేయాలని సబ్కలెక్టర్ సూచించారు. దీంతో తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి తగిన సమయం ఇవ్వాలని, 19న నిర్వహించే అరకు రైల్రోకోను తాత్కాలికంగా వాయిదా వేయాలని స్పెషల్ డీఎస్సీ సాధన సమితి నిర్ణయించింది. ఈ సందర్భంగా తమ సమస్యలపై స్పెషల్ డీఎస్సీ సాధన సమితి ప్రతినిధులు సబ్కలెక్టర్ శౌర్యమన్ పటేల్కు వినతిపత్రం సమర్పించారు.