Share News

చదువుకోవాలంటే సాహసం చేయాల్సిందే..

ABN , Publish Date - Jun 10 , 2025 | 12:35 AM

మండలంలోని మారుమూల పినకోట పంచాయతీ సొలబొంగు గ్రామానికి చెందిన విద్యార్థులు చదువుకోవడానికి సాహసం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ గ్రామంలో పాఠశాల లేకపోవడంతో నాటుపడవలో రైవాడ జలాశయాన్ని దాటి అనకాపల్లి జిల్లాలోని స్కూల్‌కు వెళ్లాల్సి వస్తోంది.

చదువుకోవాలంటే సాహసం చేయాల్సిందే..
రైవాడ జలశయాన్ని నాటుపడవలో దాటుతున్న విద్యార్థులు(ఫైల్‌ ఫొటో)

సొలబొంగు గ్రామంలో పాఠశాల లేక అవస్థలు

నాటుపడవలో రైవాడ జలాశయాన్ని దాటి వెళుతున్న విద్యార్థులు

అధికారులు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రుల ఆవేదన

అనంతగిరి, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మారుమూల పినకోట పంచాయతీ సొలబొంగు గ్రామానికి చెందిన విద్యార్థులు చదువుకోవడానికి సాహసం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ గ్రామంలో పాఠశాల లేకపోవడంతో నాటుపడవలో రైవాడ జలాశయాన్ని దాటి అనకాపల్లి జిల్లాలోని స్కూల్‌కు వెళ్లాల్సి వస్తోంది.

సొలబొంగు గ్రామం రైవాడ జలాశయాన్ని ఆనుకుని ఉంది. ఈ గ్రామంలో పాఠశాల లేకపోవడంతో 12 మంది విద్యార్థులు రోజూ నాటుపడవలో రైవాడ జలాశయాన్ని దాటి అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం తామరబ్బ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలకు వెళ్లి చదువుకుంటున్నారు. రైవాడ జలాశయంలో నీరు తక్కువగా ఉన్నప్పుడు నాటుపడవపై ప్రయాణిస్తున్నారు. వర్షాకాలంలో జలాశయంలో నీరు అధికంగా ఉంటే కొండ చుట్టూ సుమారు 4 కిలోమీటర్లు కాలినడకన పాఠశాలకు చేరుకుంటున్నారు. తమ గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయాలని పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోయిందని, తమ పిల్లలు ప్రమాదకర పరిస్థితుల్లో చదువులు కొనసాగిస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించినా ఇబ్బందులు తీరతాయని వారు చెబుతున్నారు.

Updated Date - Jun 10 , 2025 | 12:35 AM