టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
ABN , Publish Date - May 18 , 2025 | 12:36 AM
జిల్లాలో ఈ నెల 19వ తేదీ నుంచి జరగనున్న పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు.
కలెక్టర్ విజయకృష్ణన్
అనకాపల్లి కలెక్టరేట్, మే 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ నెల 19వ తేదీ నుంచి జరగనున్న పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. పరీక్షల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో శనివారం మధ్యాహ్నం కలెక్టరేట్ నుంచి ఆమె వెబెక్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద అన్ని వసతులు కల్పించాలన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకొనే విధంగా బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి జి.అప్పారావునాయుడు మాట్లాడుతూ పరీక్షలకు 2,481 మంది రెగ్యులర్ విద్యార్థులు, 1,268 మంది ప్రైవేటు విద్యార్థులు హాజరుకానున్నారన్నారు. వారికి జిల్లా వ్యాప్తంగా 19 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో రెవెన్యూ, పోలీస్, ఆర్టీసీ, ట్రెజరీ, పోస్టల్, విద్యుత్, ఆరోగ్యశాఖల అధికారులు పాల్గొన్నారు.