ట్రాన్స్ఫార్మర్ల చోరీ కేసులో ముగ్గురి అరెస్టు
ABN , Publish Date - Jun 14 , 2025 | 01:11 AM
విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని పలు మండలాల్లో గత రెండేళ్లుగా ఏపీఈపీడీసీఎల్కు చెందిన 42 ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేసిన కేసుల్లో ముగ్గురు నిందితులను శుక్రవారం సబ్బవరం పోలీసులు అరెస్టు చేశారు.
పరారీలో మరో ఇద్దరు
విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో 42 ట్రాన్స్ఫార్మర్లను అపహరించారని డీఎస్పీ వెల్లడి
సబ్బవరం, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని పలు మండలాల్లో గత రెండేళ్లుగా ఏపీఈపీడీసీఎల్కు చెందిన 42 ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేసిన కేసుల్లో ముగ్గురు నిందితులను శుక్రవారం సబ్బవరం పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలు ఉన్నారు. దీనికి సంబంధించి పరవాడ డీఎస్పీ వి.విష్ణుస్వరూప్ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. విశాఖపట్నం మర్రిపాలేనికి చెందిన గరికిపాటి సాయికిరణ్, పట్నాల రాజేశ్వరరావు, మహరాణిపేటకు చెందిన నెల్ల సాయిప్రసాద్తో పాటు మరో ఇద్దరు 2023 నవంబరు నుంచి 2025 జూన్ వరకూ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని సబ్బవరం, ఆనందపురం, పెందుర్తి, అచ్యుతాపురం, చోడవరం, కశింకోట, యలమంచిలి, భీమిలి మండలాల్లో ఏపీఈపీడీసీఎల్కు చెందిన ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేశారు. అప్పటి నుంచి ఆయా పోలీసు స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి. 8 మండలాల్లో 42 ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేయగా, ఇందులో అత్యధికంగా సబ్బవరం మండలంలో 15 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయని డీఎస్పీ తెలిపారు. నిందితులు ట్రాన్స్ఫార్మర్లలో ఉండే కాపర్ వైర్ను తీసి అమ్మేసేవారన్నారు. ఈ విధంగా 190 కిలోల కాపర్ తీగను అమ్మేశారన్నారు. దీనిని రికవరీ చేశామని ఆయన తెలిపారు. ఈ కేసుల్లో మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు. నిందితులను పట్టుకోవడంలో చొరవ చూపిన సీఐ జి.రామచంద్రరావు, ఎస్ఐలు పి. సింహాచలం, దివ్య, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.