ఇద్దరు యువకుల దుర్మరణం
ABN , Publish Date - May 27 , 2025 | 01:51 AM
మండలంలోని పెదపాడువద్ద సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు.
అచ్యుతాపురం మండలం పెదపాడులో ఘటన
గ్రామంలో విషాదఛాయలు
అచ్యుతాపురం రూరల్, మే 25 (ఆంధ్రజ్యోతి):
మండలంలోని పెదపాడువద్ద సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. గ్రామంలో నుంచి మెయిన్ రోడ్డుపైకి వస్తున్న ట్రాక్టర్, ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా వున్నాయి.
పెదపాడుకు చెందిన రాయి గణేశ్ (23), జనపరెడ్డి సంజీవి (21) స్నేహితులు. గణేశ్ ప్రత్యేక ఆర్థిక మండలిలోని ఒర టైర్ల తయారీ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా, సంజీవి ఇదే ప్రాంతంలో వున్న రెబ్బెస్ట్ రిబ్బన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం వ్యక్తిగత పనిమీద తిమ్మరాజుపేట వెళ్లారు. అక్కడి నుంచి ఆరు గంటల గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వస్తున్నారు. ఆంజనేయస్వామి గుడి వద్దకు వచ్చేసరికి... గ్రామంలో నుంచి మెయిన్ రోడ్డులోకి వస్తున్న ట్రాక్టర్ ఢీకొన్నది. దీంతో రోడ్డుపై పడిపోవడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు చెప్పారు. దీంతో ఇరువురి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. చేతికి అందివచ్చిన బిడ్డలను ట్రాక్టర్ రూపంలో వచ్చిన మృత్యువు కబళించిందంటూ రోదించారు. రాయి చిలుకునాయుడు, లక్ష్మిలకు గణేశ్తో పాటు కుమార్తె పూజిత వున్నారు. జనపరెడ్డి సత్యారావు, వరలక్ష్మి దంపతులకు సంజీవి ఒక్కడే కుమారుడు. మగ బిడ్డలు శాశ్వతంగా దూరం కావడంతో రెండు కుటుంబాల్లో అంతులేని విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. మంగళవారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని చెప్పారు.