వీడని వాన
ABN , Publish Date - Jul 13 , 2025 | 11:11 PM
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో శనివారం రాత్రి నుంచి వర్షం కురుస్తునే ఉంది.
జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు
పొంగుతున్న గెడ్డలు, వాగులు
జన జీవనానికి అంతరాయం
శబరి, గోదావరి నదులు ఉగ్రరూపం
అప్రమత్తమైన అధికార యంత్రాంగం
పాడేరు, జూలై 13 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో శనివారం రాత్రి నుంచి వర్షం కురుస్తునే ఉంది. గత రెండు రోజులు తెరిపిచ్చింది. శనివారం రాత్రి నుంచి వర్షం కొనసాగుతుండడంతో మళ్లీ ముసురు వాతావరణం నెలకొంది. జిల్లాలో ఆదివారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ప్రధానంగా ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్న ఎటపాక, చింతూరు, కూనవరం, వీఆర్.పురం, ముంచంగిపుట్టు, పెదబయలు, హుకుంపేట మండలాల్లో భారీ వర్షం కురుస్తున్నది. అలాగే పాడేరు మండలం మొదలుకుని జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ, అరకులోయ, చింతపల్లి మండలాల్లో గెడ్డల ఉధృతి కొనసాగుతున్నది. ముసురు వాతావరణంతోజన జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. జిల్లాలో గెడ్డల ఉధృతి ప్రభావంతో శబరి, గోదావరి నదులు ఉగ్రరూపం దాల్చాయి. తాజా వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నది.