Share News

గంజాయి శాశ్వత నిర్మూలన అందరి బాధ్యత

ABN , Publish Date - Aug 14 , 2025 | 11:25 PM

జిల్లాలో గంజాయిని శాశ్వతంగా నిర్మూలించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం ‘గంజాయి- ప్రత్యామ్నాయ పంటల’పై జిల్లా ఎస్‌పీ అమిత్‌బర్ధార్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

గంజాయి శాశ్వత నిర్మూలన అందరి బాధ్యత
మాట్లాడుతున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, పక్కన ఎస్‌పీ అమిత్‌బర్థార్‌

కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌

పాడేరు, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గంజాయిని శాశ్వతంగా నిర్మూలించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం ‘గంజాయి- ప్రత్యామ్నాయ పంటల’పై జిల్లా ఎస్‌పీ అమిత్‌బర్ధార్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో గంజాయి సాగు, వినియోగంపై అధికారులకు పక్కా సమాచారం ఉండాలన్నారు. గంజాయి సాగుతో కలిగే నష్టాలపై ప్రజలకు, వినియోగం వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. గిరిజనులను గంజాయి సాగు నుంచి విముక్తి చేసి, వారికి ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సహించాలన్నారు. డిగ్రీ, జూనియర్‌ కాలేజీల్లో, ఇతర విద్యాలయాల్లోనూ గంజాయి వల్ల కలిగే నష్టాలపై ప్రణాళికాబద్ధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అలాగే గంజాయిని వీడిన గిరిజన రైతులకు స్వయం ఉపాధి కల్పన, బ్యాంకు రుణాలు మంజూరు చేయాలన్నారు. గంజాయి సాగు, రవాణా చేస్తున్న వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లా ఎస్‌పీ అమిత్‌బర్ధార్‌ మాట్లాడుతూ గంజాయి సాగు, రవాణా అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నామని, సమాజంలోనూ మార్పు రావాలన్నారు. గంజాయి ద్వారా సంపాదించిన ఆస్తులను జప్తు చేయడం వంటి చర్యలు చేపడుతున్నామని, గంజాయి స్మగ్లర్లకు గ్రామాల్లో ఆశ్రయం కల్పించవద్దని ప్రజలకు సూచించారు. గంజాయి రవాణాను అరికట్టేందుకు ప్రతి చోటా పటిష్ట నిఘా పెట్టామన్నారు. విద్యాలయాల్లోనూ గంజాయి వల్ల కలిగే నష్టాలను తెలుపుతూ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు గిరిజన సంక్షేమ శాఖ డీడీ చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే.అభిషేక్‌గౌడ, పాడేరు, రంపచోడవరం సబ్‌కలెక్టర్లు శుభంనొక్వల్‌, శౌర్యమన్‌పటేల్‌, డీఎఫ్‌వో సందీప్‌రెడ్డి, డీఈవో పి.బ్రహ్మజీరావు, ఐసీడీఎస్‌ పీడీ ఝాన్సీబాయి, టీడబ్ల్యూ డీడీ పి.క్రాంతికుమార్‌, సీపీవో ప్రసాద్‌, ఎల్‌డీఎం మాతునాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 14 , 2025 | 11:25 PM