బీఈడీ కాలేజీల ఇష్టారాజ్యం
ABN , Publish Date - May 10 , 2025 | 12:28 AM
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనది.

విద్యార్థులు తరగతులకు హాజరుకాకపోయినా పరీక్షలు రాసేందుకు అనుమతిస్తున్న కొన్ని కళాశాలలు
అందుకు భారీగా డబ్బులు వసూలుచేస్తున్న యాజమాన్యాలు
ఒకచోట అనుమతులు తీసుకుని, మరోచోట నిర్వహణ
సిబ్బంది, మౌలిక వసతులను పరిశీలించకుండానే ప్రవేశాలకు ఏయూ అధికారుల గ్రీన్సిగ్నల్
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనది. అందుకే ఉపాధ్యాయుడికి సమాజంలో ఎంతో గౌరవం ఉంటుంది. అయితే, అటువంటి ఉపాధ్యాయులను తయారుచేసే బీఈడీ కాలేజీల నిర్వహణ అధ్వానంగా మారడం ఆందోళన కలిగిస్తోంది. అనేక కాలేజీలు విద్యార్థులు తరగతులకు హాజరుకాకపోయినా ఫీజులు చెల్లిస్తే చాలు సర్టిఫికెట్లను అందిస్తున్నాయి. ఈ విషయం తెలిసినా ఏయూ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో సుమారు 70 వరకూ బీఈడీ కాలేజీలు ఉన్నాయి. అందులో కొన్ని కాలేజీల్లో అడ్డగోలు వ్యవహారాలు జరుగుతున్నాయన్న విమర్శలు చాలాకాలంగా ఉన్నాయి. సాధారణంగా బీఈడీ కాలేజీలు నిర్వహిం చాలంటే కొన్ని నిబంధనలను పాటించాలి. అందుకు అనుగుణంగా భవనాలు, అర్హత కలిగిన సిబ్బంది వంటివి ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఏయూ అధికారులు అనుమతులు ఇవ్వాలి. ఏటా పరిశీలించిన తరువాతే అడ్మిషన్లకు అవకాశం ఇవ్వాలి. అయితే, అనేక కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ అనుమతులు ఇచ్చేస్తున్నారు. సాధారణంగా కాలేజీ ఏర్పాటు చేసినప్పుడు అడ్రస్, ఇతర వివరాలు ఇస్తారు. అయితే, రెండు జిల్లాల్లోని అనేక కాలేజీలు ఇచ్చిన అడ్రస్కు, నిర్వహిస్తున్న అడ్రస్కు సంబంధమే ఉండడం లేదు. ఈ విషయాలు తెలిసినప్పటికీ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. అలాగే, అనేక కాలేజీల్లో అర్హత కలిగిన సిబ్బంది ఉండడం లేదు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకుండా పోతోందంటున్నారు.
తరగతులకు హాజరుకాకపోయినా...
ఏటా బీఈడీ కోర్సుల్లో సుమారు ఐదు వేల మంది విద్యార్థులు చేరుతుంటారు. వారిలో దాదాపు రెండు వేల మంది తరగతులకు హాజరుకారంటే అతిశయోక్తి కాదు. బీఈడీ చేసేవారిలో ఎంతోమంది వేర్వేరు వ్యాపకాల్లో ఉంటారని, వారంతా ఆయా కాలేజీలకు ఫీజులు చెల్లించి పరీక్షలకు మాత్రమే హాజరవుతుంటారని చెబుతున్నారు. ఇటువంటి విద్యార్థుల నుంచి సదరు కాలేజీ యాజమాన్యాలు భారీగా ఫీజులు వసూలు చేస్తుంటాయన్నది జగమెరిగిన సత్యం. కాలేజీల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు, అకడమిక్ ఆడిట్లు నిర్వహించాల్సిన యూనివర్సిటీ అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తుండడంతో ఇదో పెద్ద వ్యాపారంగా మారిందని చెబుతున్నారు.