కానరాని మావోయిస్టుల బంద్ ప్రభావం
ABN , Publish Date - Oct 24 , 2025 | 11:05 PM
గూడెంకొత్తవీధి, చింతపల్లి, కొయ్యూరు మండలాల్లో సీపీఐ మావోయిస్టు బంద్ ప్రభావం కనిపించ లేదు.
చింతపల్లి/కొయ్యూరు, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): గూడెంకొత్తవీధి, చింతపల్లి, కొయ్యూరు మండలాల్లో సీపీఐ మావోయిస్టు బంద్ ప్రభావం కనిపించ లేదు. శుక్రవారం ఆపరేషన్ కగార్కి నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అభయ్ దేశవ్యాప్త బంద్కి పిలుపునిచ్చిన విషయం పాఠకులకు తెలిసిందే. మావోయిస్టు బంద్ నేపథ్యంలో పోలీసులు వాహన తనిఖీలు, గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా రాత్రివేళ బస్సులను నిలిపివేశారు. అయితే బంద్ ప్రభావం గిరిజన గ్రామాల్లో ఎక్కడా కనిపించలేదు. పీటీడీ బస్సులు, ప్రైవేటు వాహనాలు తిరిగాయి. దుకాణాలు యథావిధిగా తెరుచుకున్నాయి. పెదవలస వారపు సంత సాధారణ స్థాయిలోనే జరిగింది. కొయ్యూరు మండలం మారుమూల మంప, బూదరాళ్ల గ్రామాలకు సైతం బస్సులు, ప్రైవేటు వాహనాలు తిరిగాయి. వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు పనిచేశాయి.