Share News

మద్యం మత్తులో యువకుల హల్‌చల్‌

ABN , Publish Date - Jul 15 , 2025 | 07:56 PM

ఇంటి ముందు ఎందుకు గొడవ చేస్తున్నారని ప్రశ్నించినందుకు గాను మద్యం మత్తులో ఉన్న యువకులు ఓ వ్యక్తిపై బీరు బాటిళ్లతో దాడి చేసిన సంఘటన సోమవారం అర్ధరాత్రి గాజువాక బీసీ రోడ్డు ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

మద్యం మత్తులో యువకుల హల్‌చల్‌
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జీవన్‌కుమార్‌

ప్రశ్నించిన వ్యక్తిపై బీరు బాటిళ్లతో దాడి చేయడంతో తీవ్ర గాయాలు

11 మందిని అరెస్టు చేసిన పోలీసులు

గాజువాక, జూలై 15 (ఆంధ్రజ్యోతి): ఇంటి ముందు ఎందుకు గొడవ చేస్తున్నారని ప్రశ్నించినందుకు గాను మద్యం మత్తులో ఉన్న యువకులు ఓ వ్యక్తిపై బీరు బాటిళ్లతో దాడి చేసిన సంఘటన సోమవారం అర్ధరాత్రి గాజువాక బీసీ రోడ్డు ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బీసీ రోడ్డులో నివాసం ఉంటున్న జీవన్‌కుమార్‌ తమ ఇంటి ముందు కారు పార్కు చేశారు. సోమవారం అర్ధరాత్రి ఒంటిగంటప్పుడు కొంతమంది యువకులు ఆ కారు వద్ద పెద్దగా అరుస్తూ గొడవ పడుతున్నారు. దీంతో జీవన్‌కుమార్‌ ఇక్కడెందుకు గొడవ చేస్తున్నారని, వెళ్లిపోండని చెప్పి ఇంట్లోకి వెళ్లిపోయారు. అయితే కొంత సమయం తరువాత పలువురు యువకులు జీవన్‌కుమార్‌ ఇంటి గోడ ఎక్కి తద్వారా పైఅంతస్థుకు చేరుకుని పూల కుండీలను విరగ్గొట్టడంతో పాటు తలుపులు కొట్టడంతో జీవన్‌కుమార్‌ బయటకు వచ్చారు. ఆ సమయంలో గాజువాక ప్రాంతానికి చెందిన దనాల అప్పలరాజు (21), మజ్జి వెంకటరమణ (22), షేక్‌ బషీర్‌ (19), మోహన్‌ కార్తీక్‌ (21)లు బీరు బాటిళ్లతో జీవన్‌కుమార్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కిందనున్న మరో ఏడుగురు పెద్దగా కేకలు వేస్తూ జీవన్‌కుమార్‌ను కిందకు తీసుకురావాలని, చంపేస్తామని అరిచారు. అయితే ఆ అరుపులకు స్థానికులు అక్కడకు చేరుకోవడంతో అందరూ పారిపోయారు. కుటుంబ సభ్యులు జీవన్‌కుమార్‌ను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు 11మందిని అరెస్టు చేశారు. అర్ధరాత్రి వేళ మద్యం మత్తులో స్థానికులను భయభ్రాంతులకు గురిచేసిన యువకులపై రౌడీషీట్‌ తెరుస్తామని పోలీసులు పేర్కొన్నారు.

Updated Date - Jul 15 , 2025 | 07:56 PM