చరిత్రాత్మక ఘట్టం ‘అన్నదాత సుఖీభత’
ABN , Publish Date - Aug 02 , 2025 | 10:05 PM
అన్నదాత సుఖీభవ నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసి రైతన్నలకు ఇచ్చిన హామీని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు నిలబెట్టుకున్నారని జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. ఇక్కడి తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో శనివారం జరిగిన అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ వికాస్ పథకం మొదటి విడత నిధుల విడుదల కార్యక్రమనికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
రైతన్నలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబునాయుడు
జిల్లా ఇన్చార్జి మంత్రిడోలా శ్రీబాలవీరాంజనేయస్వామి
18,753 మంది రైతుల కోసం రూ.12,90,65,000 జమ
గాజువాక, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): అన్నదాత సుఖీభవ నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసి రైతన్నలకు ఇచ్చిన హామీని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు నిలబెట్టుకున్నారని జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. ఇక్కడి తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో శనివారం జరిగిన అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ వికాస్ పథకం మొదటి విడత నిధుల విడుదల కార్యక్రమనికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అన్నదాత సుఖీభవ పథకం చరిత్రాత్మకమైన ఘట్టమని, ఈ పథకం కింద తొలివిడతగా రాష్ట్రంలోని రైతన్నల ఖాతాల్లోకి రూ.3,174 కోట్ల నిధులను జమ చేయడం హర్షణీయమన్నారు. జిల్లాలో 18,753 మంది రైతులకు గాను రూ.12,90,65,000 జమ చేయడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాన ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోందన్నారు. ఒకపక్క ప్రజా సంక్షేమం, మరోపక్క అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ స్వర్ణాంధ్ర దిశగా రాష్ట్రం పరుగులు తీస్తోందని పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడమే ధ్యేయంగా చంద్రబాబు, మంత్రి లోకేశ్ విదేశీ సంస్థల నుంచి పెట్టుబడులు తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు తప్పుడు మెయిల్స్ పెట్టించడం వైసీపీ నీచ రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి అన్ని రంగాలను సర్వనాశనం చేశారని శ్రీబాలవీరాంజనేయస్వామి మండిపడ్డారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. రైతు భరోసా పథకం దుర్వినియోగం కాకుండా నిజమైన లబ్ధిదారులు మాత్రమే పొందాలని సూచించారు. ‘ఉత్తర’ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకానికి కేంద్రం కూడా నిధులు అందించి రైతులకు అండగా నిలుస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం సుపరిపాలనను అందించి ప్రజలను అన్నివిధాలా ఆదుకుంటోందన్నారు. కలెక్టర్ ఎంఎన్ హరేంధిరప్రసాద్ మాట్లాడుతూ ‘అన్నదాత సుఖీభవ’ నిధులను రైతులందరూ వ్యవసాయానికి అవసరమయ్యే విత్తనాలు, ఎరువుల కొనుగోలుతో పాటు పెట్టుబడులు పెట్టుకునేందుకు వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ పర్సన్ ఇన్చార్జి కోన తాతారావు, డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, మాజీ ఎమ్మెల్సీ డి.రామారావు, తహశీల్దార్ ఎ.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.