Share News

పండుగ సందడి షురూ

ABN , Publish Date - May 08 , 2025 | 11:30 PM

పాడేరు మోదకొండమ్మ ఉత్సవాల సందడి మొదలైంది. ఈ నెల 11, 12, 13 తేదీల్లో ఉత్సవాలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో అధికార యంత్రాంగం, ఉత్సవ కమిటీ ప్రతినిధులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఆలయానికి కొత్త రంగులు వేయడం పూర్తికాగా, ప్రధాన విగ్రహానికి రంగుల వేస్తున్నారు.

పండుగ సందడి షురూ
సీఎం చంద్రబాబుకు ఆహ్వానపత్రిక అందిస్తున్న మంత్రి

11, 12, 13 తేదీల్లో ఉత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు

ఉత్సవాల నిర్వహణపై రెండు సార్లు సమావేశం నిర్వహించిన కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

పాడేరు మోదకొండమ్మ ఉత్సవాల సందడి మొదలైంది. ఈ నెల 11, 12, 13 తేదీల్లో ఉత్సవాలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో అధికార యంత్రాంగం, ఉత్సవ కమిటీ ప్రతినిధులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఆలయానికి కొత్త రంగులు వేయడం పూర్తికాగా, ప్రధాన విగ్రహానికి రంగుల వేస్తున్నారు. ఉత్సవాల్లో అమ్మవారిని కొలువు తీర్చే సతకంపట్టు పందిరి నిర్మాణం జరుగుతున్నది. ఉత్సవాల్లో భాగంగా పట్ణణ వీఽధుల్లో విద్యుత్‌ అలంకరణ పనులు చేపడుతున్నారు. అంబేడ్కర్‌ సెంటర్‌ నుంచి అరకులోయ, విశాఖపట్నం, చింతపల్లి వెళ్లే మార్గాల్లో సీరియల్‌ సెట్‌లతో విద్యుత్‌ అలంకరణ చేస్తున్నారు. పట్టణంలోని మెయిన్‌ రోడ్డుపై భారీ విద్యుత్‌ సెట్టింగ్‌ల కోసం కటౌట్‌లు పెడుతున్నారు. నాలుగు చోట్ల స్టేజ్‌లను నిర్మించి సినీ, టీవీ నటులతో పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. చిన్నా పెద్ద్దలకు వినోదం పంచేందుకు స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలోని ప్లేజోన్‌లో జెయింట్‌ వీల్‌, డిస్కోడ్యాన్స్‌, డ్రాగన్‌ ట్రైన్‌, పలు రకాల చిన్న పిల్లల ఆటల పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు. మూడు రోజుల ఉత్సవాలకు వచ్చే వారికి ఆధ్యాత్మికంతో పాటు వినోదాన్ని అందించేలా ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేస్తున్నది. అధికార యంత్రాంగం సైతం ఉత్సవాలకు వచ్చే భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుధ్యం, అత్యవసర వైద్యసేవలు అందిస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఉచిత భోజన సదుపాయాలను సమకూర్చుతారు. ఉత్సవాలకు అధిక సంఖ్యలో జనం తరలివస్తున్న నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన బందోబస్తు ఏర్పాట్లను పోలీసు అధికారులు చేపడతారు.

కలెక్టర్‌ ఆధ్వర్యంలో రెండు సార్లు సమావేశాలు

స్థానిక మోదకొండమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్‌ ఏఎ్‌స దినేశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో అధికారులు, ఉత్సవ, ఆలయ కమిటీ ప్రతినిధులతో ఇప్పటికే రెండు సార్లు సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఉత్సవ కమిటీ, అధికారులు సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జనం రద్దీ నేపథ్యంలో ట్రాఫిక్‌, ఇతర తోపులాట వంటి సమస్యలు తలెత్తకుండా పోలీసులు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సూచించారు.

ఉత్సవాలకు ముఖ్యమంత్రికి ఆహ్వానం

జిల్లా కేంద్రం పాడేరులో ఈ నెల 11, 12, 13 తేదీల్లో వైభవంగా జరిగే మోదకొండమ్మ ఉత్సవాలకు రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర మహిళా శిశు, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆహ్వానించారు. ఈ మేరకు అమరావతిలో గురువారం ఆమె సీఎం చంద్రబాబునాయుడును కలిసి మోదకొండమ్మ ఉత్సవాల ప్రత్యేకతను వివరించి, హాజరుకావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందించారు. గ్రామ స్థాయిలో ఉండే మోదకొండమ్మ ఉత్సవాలను రాష్ట్ర పండుగ గుర్తించి ఉత్సవాలకు మరింత ప్రాచుర్యం తీసుకువచ్చింది గతంలో టీడీపీ ప్రభుత్వమేని, అలాగే ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సీఎంకు మంత్రి సంధ్యారాణి వివరించారు.

Updated Date - May 08 , 2025 | 11:30 PM