ఇంటి పన్ను వసూలులో జిల్లా ఫస్ట్
ABN , Publish Date - Dec 11 , 2025 | 11:33 PM
ఇంటి పన్ను వసూలులో రాష్ట్రంలోని పంచాయతీల్లో అల్లూరి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) చంద్రశేఖర్ తెలిపారు.
రాష్ట్రంలోని పంచాయతీల్లో ప్రథమ స్థానం
జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్
కొయ్యూరు, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): ఇంటి పన్ను వసూలులో రాష్ట్రంలోని పంచాయతీల్లో అల్లూరి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) చంద్రశేఖర్ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 2025-26 సంవత్సరంతో పాటు ఎరియర్స్ కలిపి రూ 13.56 కోట్లు మేర బకాయిలున్నాయన్నారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటి వరకు రూ 3.08 కోట్లు వసూలైందని చెప్పారు. దీంతో పంచాయతీల్లో ఇంటి పన్ను వసూళ్లలో అల్లూరి జిల్లా ప్రథమ, తూర్పు గోదావరి జిల్లా ద్వితీయ, తిరుపతి తృతీయ స్థానాల్లో నిలిచాయని తెలిపారు. జిల్లాలో ఇంటి పన్ను వసూలులో జి.మాడుగుల, కొయ్యూరు మండలాలు ముందంజలో ఉన్నాయన్నారు. స్వర్ణ పంచాయతీ పేరుతో ప్రత్యేక యాప్ పెట్టడం వలన ఇంటి పన్నులను డిజిటల్ పేమెంట్ సిస్టంలో వసూలు చేస్తున్నట్టు చెప్పారు. అలాగే జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్యాలయ భవనాలు లేని వాటికి 32 భవనాలను ప్రభుత్వం మంజూరు చేసిందని, ఒక్కో భవనం రూ.32 లక్షల వ్యయంతో నిర్మిస్తామని తెలిపారు. ఇవి కాకుండా మరో 21 భవనాలకు ప్రతిపాదనలు పంపామని, వాటికి సంబంధించి ఈ నెలలో నిధులు మంజూరయ్యే అవకాశం ఉందన్నారు. గతంతో పోలిస్తే గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ మెరుగ్గా ఉందన్నారు. గ్రామాల్లో చెత్త సేకరణకు 400 ట్రైసైకిళ్లకు ప్రతిపాదనలు పంపామని, త్వరలో అవి వస్తాయని తెలిపారు.