పరిష్కార వివరాలు ప్రజలకు చెప్పాలి
ABN , Publish Date - May 23 , 2025 | 11:06 PM
ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ(మీకోసం)లో సమస్యలపై వినతులు ఇచ్చిన ప్రజలకు వాటి పరిష్కారానికి చేపట్టిన చర్యలను విధిగా తెలపాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్కుమార్ అధికారులను ఆదేశించారు.
మీకోసంలో కలెక్టర్ దినేశ్కుమార్
వినతుల పరిష్కార వివరాలకు ట్రోల్ ఫ్రీ నంబర్ 1100
పాడేరు, మే 23 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ(మీకోసం)లో సమస్యలపై వినతులు ఇచ్చిన ప్రజలకు వాటి పరిష్కారానికి చేపట్టిన చర్యలను విధిగా తెలపాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీకోసంలో ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజలు సమర్పించే వినతులను విధిగా ఆన్లైన్లో నమోదు చేయాలని, వాటిని పక్కాగా పరిశీలించి పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. అలాగే ప్రజలిచ్చిన వినతులపై ఎటువంటి చర్యలు చేపడుతున్నామనేది వారికి తెలియజేయాలని సూచించారు. మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థపై ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని, ఈ క్రమంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించద్దని హితవు పలికారు. ఆయా వినతులపై తూతూమంత్రంగా చర్యలు చేపడితే, అందుకు బాధ్యులైన వారిపై శాఖాపరమైన చర్యలు చేపడతామని కలెక్టర్ దినేశ్కుమార్ హెచ్చరించారు.
ట్రోల్ ఫ్రీ నంబర్ 1100
ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ(మీకోసం)లో వినతులకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు ఉన్న ట్రోల్ ఫ్రీ నంబర్ 1100 సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఏఎస్.దినేశ్కుమార్ సూచించారు. అర్జీదారులు తమ ఫిర్యాదు స్థితిగతులు, పరిష్కార చర్యలను స్వయంగా తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ నంబర్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గిరిజన ప్రాంతంలో దీనిని వినియోగించుకుని అర్జీదారులు లబ్ధిపొందాలని కలెక్టర్ కోరారు. అంతకుముందు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనుల నుంచి కలెక్టర్ దినేశ్కుమార్, జేసీ అభిషేక్గౌడ, డీఆర్వో కె.పద్మలత 89 వినతులను స్వీకరించారు.
ప్రతీ ప్రభుత్వ శాఖ ఉద్యోగి యోగా చేయాలి
యోగాంధ్ర-2025లో భాగంగా ప్రతీ ప్రభుత్వ శాఖలోని అధికారులు, ఉద్యోగులు విధిగా యోగా సాధన చేయాలని కలెక్టర్ ఏఎస్.దినేశ్కుమార్ అన్నారు. రోజుకొక శాఖ చొప్పున ప్రతి రోజూ యోగా సాధన చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. యోగ జీవితంలో ఒక భాగంగా ఉండేలా చూడాలని, మాస్టర్ ట్రైనర్ల ద్వారా ప్రజలకు యోగాలో శిక్షణ అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్గౌడ, సబ్కలెక్టర్ సౌర్యమన్పటేల్, జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత, గిరిజన సంక్షేమ శాఖ ఎస్డీసీ ఎంవీవీఎస్.లోకేశ్వరరావు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఎల్.రజని, గ్రామ సచివాలయాల నోడల్ అధికారి పీఎస్.కుమార్, రోడ్లు, భవనాల శాఖ ఈఈ బాల సుందరబాబు, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఈ జవహర్కుమార్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఈఈ టి.కొండయ్యపడాల్, స్థానిక తహసీల్దార్ వి. త్రినాథరావునాయుడు, అధికారులు పాల్గొన్నారు.