కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి
ABN , Publish Date - Aug 13 , 2025 | 12:33 AM
రైతులను అన్ని విధాలుగా ఆదుకోవడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ పరిపాలన సాగిస్తున్నారని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలు సందర్భంగా మంగళవారం విజయోత్సవాన్ని నిర్వహించారు.
అన్నదాతలను అన్ని విధాలా ఆదుకోవడమే లక్ష్యం
హోం మంత్రి వంగలపూడి అనిత
ట్రాక్టర్లతో అన్నదాత సుఖీభవ సంఘీభావ ర్యాలీ
ఎస్.రాయవరం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): రైతులను అన్ని విధాలుగా ఆదుకోవడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ పరిపాలన సాగిస్తున్నారని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలు సందర్భంగా మంగళవారం విజయోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్.రాయవరం నుంచి వెంకటాపురం వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర 70కిపైగా టాక్టర్లతో నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. అనంతరం వెంకటాపురంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, వ్యవసాయ రంగం ఆధునికీకరణకు, ప్రకృతి సేద్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు. పొలంలో విత్తనాలు చల్లడం, పంటలకు ఎరువులు వేయడం, పురుగు నివారణ మందులు పిచికారీ చేయడం కోసం రైతులకు రాయితీపై డ్రోన్లు అందిస్తున్నదని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తున్నదని మంత్రి చెప్పారు. ఈ నెల 15వ తేదీ నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వస్తుందన్నారు. అనంతరం కొత్తగా ఏర్పాటు చేసిన పార్కును, ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన రోడ్లను, టీడీపీ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ, టీడీపీ నియోజకవర్గం కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేశ్, పార్టీ మండల అధ్యక్షుడు అమలకంటి అబద్దం, ఎంపీపీ బొలిశెట్టి గోవిందరావు, జడ్పీటీసీ సభ్యురాలు కాకర దేవి, మాజీ ఎంపీపీ యేజెర్ల వినోద్రాజు, జనసేన సీనియర్ నాయకుడు తోట నగేశ్, తదితరులు పాల్గొన్నారు.