లంబసింగిలో టెంట్ సిటీ
ABN , Publish Date - Jun 28 , 2025 | 12:52 AM
ఆంధ్ర కశ్మీర్ లంబసింగిలో అతిథులకు ఆతిథ్యమిచ్చేందుకు టెంట్ సిటీ, క్యారవాన్ టూరిజాన్ని అభివృద్ధి చేసేలా రెవెన్యూ, అటవీశాఖ అధికారులు కార్యాచరణ ప్రారంభించారు. ప్రతి ఏడాది లంబసింగిని సందర్శించే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పర్యాటక సీజన్లో లక్షల్లో దేశ, విదేశీ పర్యాటకులు లంబసింగిని సందర్శిస్తున్నారు. దీంతో పర్యాటకులను ఆకర్షించే విధంగా మెరుగైన సదుపాయాలు కల్పించడంతో పాటు స్థానిక గిరిజనులకు స్వయం ఉపాధి అవకాశాలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ఈ మేరకు టెంట్ సిటీలు, క్యారవాన్ టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు అటవీ, రెవెన్యూశాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు.
- క్యారవాన్ టూరిజం కూడా..
- రెవెన్యూ, అటవీశాఖ ప్రత్యేక కార్యాచరణ
- సీజన్ నాటికి సందర్శకులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు
చింతపల్లి, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర కశ్మీర్ లంబసింగిలో అతిథులకు ఆతిథ్యమిచ్చేందుకు టెంట్ సిటీ, క్యారవాన్ టూరిజాన్ని అభివృద్ధి చేసేలా రెవెన్యూ, అటవీశాఖ అధికారులు కార్యాచరణ ప్రారంభించారు. ప్రతి ఏడాది లంబసింగిని సందర్శించే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పర్యాటక సీజన్లో లక్షల్లో దేశ, విదేశీ పర్యాటకులు లంబసింగిని సందర్శిస్తున్నారు. దీంతో పర్యాటకులను ఆకర్షించే విధంగా మెరుగైన సదుపాయాలు కల్పించడంతో పాటు స్థానిక గిరిజనులకు స్వయం ఉపాధి అవకాశాలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ఈ మేరకు టెంట్ సిటీలు, క్యారవాన్ టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు అటవీ, రెవెన్యూశాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు.
ఆంధ్ర కశ్మీర్గా గుర్తింపు పొందిన లంబసింగి సముద్రమట్టానికి 3,800 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ వాతావరణం భిన్నంగా వుంటుంది. మూడు కాలాల్లోనూ లంబసింగి పరిసర ప్రాంతాలు చల్లని వాతావరణం కలిగి వుంటాయి. వేసవిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36-38 డిగ్రీలకు మించి నమోదు కాదు. శీతాకాలంలో సున్న, మైనస్ డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. పచ్చని అడవులను తాకుతూ శ్వేతవర్ణంలో పయనించే మంచు మేఘాలు, శీతల వాతావరణం లంబసింగి సొంతం. ఈ ప్రాంత వాతావరణం ఉత్తర భారతదేశాన్ని పోలి వుండడంతో గత పదేళ్లుగా లంబసింగిని సందర్శించే పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది. లంబసింగి వచ్చే పర్యాటకులకు చెప్పుకోదగిన సదుపాయాలు ఇక్కడ అందుబాటులో లేవు. పర్యాటకశాఖకు చెందిన హరిత రిసార్ట్స్ వున్నప్పటికి కేవలం 12 గదులు మాత్రమే అందుబాటులో వున్నాయి. మూడు, నాలుగు ప్రైవేటు రిసార్ట్స్ మాత్రమే పర్యాటకులు బస చేసేందుకు సౌకర్యవంతంగా వున్నాయి. దీంతో లంబసింగిలో రాత్రి బస చేసేందుకు పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. మెజారిటీ పర్యాటకులు నర్సీపట్నంలో బస చేసి ఉదయం నాలుగు, ఐదు గంటలకు వ్యక్తిగత, ప్రైవేటు వాహనాల్లో లంబసింగి చేరుకుంటున్నారు. ఈ నేపఽథ్యంలో లంబసింగి- తాజంగి ప్రాంతంలో పర్యాటకులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. కేరళ తరహాలో ప్రకృతికి హాని కలగకుండా పర్యాటకులను ఆకర్షించేందుకు టెంట్ సిటీ, క్యారవాన్ టూరిజాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.
క్యారవాన్ టూరిజం
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో కలెక్టర్ దినేశ్కుమార్ లంబసింగి- తాజంగి పంచాయతీల పరిధిలో క్యారవాన్ టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని స్థానిక రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు స్థానిక తహశీల్దార్ టి.రామకృష్ణ తాజంగి- లంబసింగి మధ్యలోనున్న ఏడు కిలోమీటర్ల ప్రధాన రహదారికి ఇరువైపులా క్యారవాన్ టూరిజం అభివృద్ధికి అనువైన ప్రాంతాలను గుర్తించారు. లంబసింగి-తాజంగి మధ్యలో మూడు ప్రాంతాల్లో క్యారవాన్ టూరిజం కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు తహశీల్దార్ ప్రతిపాదనలు సిద్ధం చేసి కలెక్టర్కు పంపించారు.
కేరళ తరహాలో అభివృద్ధి
కేరళలో క్యారవాన్ టూరిజానికి మంచి ఆదరణ లభిస్తున్నది. బస్సులు, వ్యక్తిగత వాహనాల్లో వచ్చే పర్యాటకులకు క్యారవాన్ కేంద్రాల్లో అవసరమైన కనీస సదుపాయాలు కల్పిస్తుంటారు. పర్యాటకులకు బస చేసేందుకు ప్రత్యేక గదులు ఉండవు. వ్యక్తిగత వాహనాల్లో వచ్చిన సందర్శకులు వాహనాల్లోనే బస చేస్తారు. అయితే పర్యాటకులకు అవససరమైన మరుగుదొడ్లు, వాష్రూమ్లు, రక్షిత మంచినీరు, క్యాంటీన్ సదుపాయం కల్పిస్తారు. పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచే ప్రాంతాలను క్యారవాన్ టూరిజం కేంద్రాలకు ఎంపిక చేస్తారు.
అందుబాటులోకి టెంట్ సిటీలు
కృష్ణాపురం వనవిహారి తరహాలో తాజంగి- లంబసింగి ప్రాంతంలో టెంట్ సిటీలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక డివిజనల్ ఫారెస్టు అధికారి వైవీ నరసింహరావు పర్యవేక్షణలో అటవీశాఖ అధికారులు టెంట్ సిటీలను అభివృద్ధి చేసేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించారు. ప్రధానంగా తాజంగి- లంబసింగి ప్రధాన మార్గంలో మూడు, నాలుగు చోట్ల టెంట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో పర్యాటకులు బస చేసేందుకు సింగిల్, డబుల్, త్రిబుల్ టెంట్లు, సెమీపర్మినెంట్ కాటేజీలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ టెంట్ సిటీల్లో పర్యాటకుల భద్రతకు అటవీశాఖ సిబ్బంది 24 గంటలు అందుబాటులో వుంటారు. అలాగే పర్యాటకులకు అవసరమైన మరుగుదొడ్లు, వాష్రూమ్స్, క్యాంటీన్, విద్యుత్ అలంకరణ, అడ్వెంచర్, పలు రకాల క్రీడలు, ఆదివాసీల థింసా నృత్యం, ట్రెక్కింగ్ పాత్లు ఏర్పాటు చేస్తారు. ఈ టెంట్ సిటీలో బస చేసే పర్యాటకులకు ఓ కొత్త అనుభూతి కలుగుతుంది. ఈ టెంట్ సిటీలు అటవీశాఖ పర్యవేక్షణలో స్థానిక గిరిజనులకు నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తారు. గిరిజన వ్యవసాయ, అటవీ ఉత్పత్తులు విక్రయించేందుకు స్టాల్స్ను టెంట్ సిటీల వద్ద ఏర్పాటు చేస్తారు.